గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శనివారం, 3 నవంబరు 2018 (16:00 IST)

రాహుల్ గాంధీతో కోదండ‌రామ్ భేటీలో అస‌లు ఏం జ‌రిగింది..?

కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీతో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ భేటీ అయ్యారు. రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లి ఆయనతో కోదండ‌రామ్ సమావేశమయ్యారు. ఈ భేటీలో సీట్ల కేటాయింపులతో పాటు, ఎన్నికల ప్రచార వ్యూహం, భవిష్యత్ కార్యాచరణ పై ప్రధానంగా చర్చించారని తెలిసింది. 
 
తెలంగాణలోని 119 స్థానాల్లో కాంగ్రెస్ 95, టీడీపీ 14 స్థానాల్లో పోటీ చేస్తాయని ఢిల్లీలో కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ప్రకటించిన సంగతి తెలిసిందే. టీజేఎస్, సీపీఐలకు మిగిలిన 10 స్థానాలు కేటాయిస్తామని చెప్పారు. తమకు 15 సీట్లు ఇవ్వాలని కోదండరామ్ డిమాండ్ చేస్తున్నారని వార్త‌లు వ‌స్తున్నాయి.
 
రాహుల్ గాంధీతో భేటీ అనంత‌రం కోదండ‌రామ్ మాట్లాడుతూ… రాహుల్ గాంధీతో 40 నిమిషాలు చ‌ర్చించాను. క‌లిసి వ‌చ్చే శ‌క్తుల‌తో ప‌ని చేసేందుకు సిద్ద‌మ‌ని రాహుల్ చెప్పారు. క‌ల‌లుగ‌న్న తెలంగాణ కోసం కృషి చేద్దామ‌న్నారు. తెలంగాణ‌లో మార్పు కోసం కాంగ్రెస్ పార్టీతో క‌లిసి ప‌ని చేస్తాం. ఉమ్మ‌డి ప్రణాళిక పైన కూడా రాహుల్ గాంధీతో చ‌ర్చించాను అని చెప్పారు. కూట‌మి ఏర్పాటు త్వ‌ర‌గా పూర్తి కావాల‌ని రాహుల్ గాంధీని కోరానని… కూట‌మి ఏర్పాటులో జాప్య‌మైతే అన్ని పార్టీల‌కు న‌ష్ట‌మ‌ని అన్నారు.
 
కూట‌మి ఏర్పాటు అవ‌శ్య‌క‌త‌ను ప్ర‌జ‌ల్లో స‌మ‌ర్థంగా తీసుకెళ్లాలి. సీట్ల విష‌యంలో పార్టీల మ‌ధ్య చ‌ర్చ‌లు పూర్తి కావ‌టం లేదు. కూట‌మి ఏర్పాటు వేరు.. సీట్ల పంప‌కం వేరు అన్నారు. సీట్ల పంప‌కం గురించి రాహుల్ గాంధీతో స‌మావేశంలో చ‌ర్చ‌కు రాలేదు. పొత్తులో భాగంగా మేం 17 సీట్లు కావాల‌ని కోరుతున్నాం. సీట్ల కేటాయింపు పైన కాంగ్రెస్ ప్ర‌క‌ట‌న గురించి నాకు తెలియ‌దు. సీట్ల కేటాయింపు త్వ‌ర‌గా ప‌రిష్క‌రం కావాల‌ని కోరాను. చ‌ర్చ‌ల ప‌రిష్క‌రం కాక‌పోతే మేమే వేరే కార్య‌చ‌ర‌ణ ప్ర‌క‌టిస్తామ‌న్నారు. దాదాపు 25 చోట్ల మా పార్టీ నేత‌లు ప‌టిష్టంగా ఉన్నారు అని తెలియ‌చేసారు.