జన్మనిచ్చిన తల్లినే చంపేశాడు.. మంచానికే పరిమితమైందని.. తలబద్ధలు కొట్టి..!
జన్మనిచ్చిన తల్లికి కన్నకొడుకే కాలయముడయ్యాడు. చివరివరకు కాపాడి పోషిస్తాడనుకుంటే తలబద్దలు కొట్టాడు. వయసుపైబడి అనారోగ్యంపాలైన తల్లిని ఘోరంగా హత్యచేశాడు. గోడకేసి బాది తలబద్దలు కొట్టడంతో ఆమె మరణించింది. అయితే మంచం కిందపడి మరణించిందని అందరిని నమ్మించాడు. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 2 దోభిఘాట్కు చెందిన రాణిబాయికి కరణ్సింగ్ అనే కుమారుడున్నాడు.
రాణిబాయి ఎంతో కష్టపడి కుమారుడిని పెంచి పెద్ద చేసింది. రాణబాయి అనారోగ్య సమస్యతో మంచం ఎక్కింది. అప్పట్నుంచి కరణ్సింగ్ ఆమె పట్ల కఠినంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఇటీవల అనారోగ్యం ఎక్కువై మంచం పైనుంచి లేవలేని స్థితికి చేరుకుంది. మలమూత్రాలు ఇంట్లోనే విసర్జించడంతో ఆగ్రహానికి గురైన కరణ్సింగ్ రెండు రోజుల ముందు ఆమెను కింద పడేసి తలను గోడకేసి బాదాడు. తీవ్ర రక్తస్రావంతో రాణిబాయి అక్కడికక్కడే మృతువాత పడ్డారు.
ఎవ్వరికి అనుమానం రాకుండా ఉండేందుకు కరణ్ సింగ్ కుట్రపన్నాడు. ఈ హత్యను ప్రమాదంగా చిత్రీకరించాడు. అనారోగ్యంతో బాదపడుతున్నతల్లి మంచంలో నుంచి కిందకు దిగుతుండగా పడిపోయి మరణించిందని అందరిని నమ్మించాడు ఈ కసాయి. అనంతరం బుధవారం అంత్యక్రియలు పూర్తిచేశాడు. అయితే అంత్యక్రియల సందర్భంగా కరణ్ ప్రవర్తనపై రాణిబాయి సోదరుడు రణబీర్సింగ్కు అనుమానం వచ్చింది.
దీంతో ఆయన బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరణ్సింగ్ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తే తానే హత్య చేసిన్నట్టు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.