కేసీఆర్తో తలసాని ఏకాంతపు చర్చలు : టీడీపీలో వికెట్ పడినట్టేనా?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావుతో సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం గంట పాటు ఏకాంత చర్చలు జరిపారు. దీంతో ఆయన కూడా తెరాస తీర్థం పుచ్చుకోవడం ఖాయమని తెలుస్తోంది. తెలంగాణ శాసనసభ టీడీపీ పక్ష నాయకుడి పదవిని ఆశించిన తలసాని ఆ పదవి లభించకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. ఆ పదవికి ఎర్రబెల్లి దయాకరరావును ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
తలసానికి తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు అత్యంత సన్నిహితుడు. ఆయన రాయబారం ఫలితంగా తలసాని టీఆర్ఎస్లో చేరనున్నట్లు సమాచారాం. తలసానితో పాటు పలువురు టీడీపీ నేతలు కూడా టీఆర్ఎస్లో చేరనున్నట్లు సమాచారం. తలసాని విజ్ఞప్తి మేరకు కేసీఆర్ సోమవారం సాయంత్రం సనత్ నగర్లోని ఐడిహెచ్ కాలనీ సందర్శించనున్నారు.
కాగా, ఇప్పటికే ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు టీడీపీకి రాజీనామా చేసి కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్లో చేరిన విషయం తెల్సిందే.