శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : శనివారం, 17 నవంబరు 2018 (09:55 IST)

ఎన్నికల బరిలో సుహాసిని.. ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ ప్రచారం చేస్తారా? లేదా?

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని పోటీ చేస్తున్నారు. ఆమె శనివారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఆమె వెంట సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో పాటు పార్టీ నేతలు ఉండనున్నారు. ముందుగా అంటే శనివారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ ఘాట్‌కు, తన తండ్రి సమాధికి నివాళులు అర్పించారు. 
 
ఈ సందర్భంగా విలేకరులు అడిగి ప్రశ్నలకు సమాధానమిస్తూ, తనకు మద్దతుగా తన తమ్ముళ్లు టాలీవుడ్ హీరోలు అయిన కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లు ప్రచారం చేసే విషయంపై తుది నిర్ణయం వారిదేనని చెప్పారు. ఈ విషయంపై త్వరలోనే ఓ స్పష్టత ఇస్తామన్నారు. అదేసమయంలో తనను ఎన్నుకుంటే ప్రజల కోసం అనునిత్యం కష్టపడతానని చెప్పారు. 
 
కాగా, హైదరాబాద్ నగరంలో సెటిలర్లు అధికంగా నివశించే కూకట్‌పల్లి స్థానం నుంచి సుహాసిని టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈమె అభ్యర్థిత్వం ఖరారైనప్పటి నుంచి ఎన్నికల ప్రచారం కోసం బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు వస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ, వారు ప్రచారానికి వస్తారా రారా అనే అంశంపై స్పష్టత మాత్రం లేదు.