శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : మంగళవారం, 20 నవంబరు 2018 (09:56 IST)

ఇక దుమ్మురేగుడే.. అస్త్రశస్త్రాలతో పర్యటనలు... ప్రముఖులంతా ప్రచారంలోకి...

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ఘట్టం ముగిసింది. పార్టీ టిక్కెట్లు దక్కినవారు ఆశతో... దక్కనివారు పట్టుదలతో స్వతంత్ర అభ్యర్థులుగా తమతమ పరిధుల్లో ఉన్న ఎన్నికల కార్యాలయాలకు ఆఖరి రోజైన శనివారం పోటెత్తి నామినేషన్లు సమర్పించారు. ఇక మిగిలిందల్లా ప్రచారమే. ప్రజల్ని తమవైపు తిప్పుకోవాలంటే మిగిలి ఉన్నది కాస్త సమయమే. డిసెంబరు ఏడో తేదీన పోలింగ్ జరుగనుంది. 
 
అంతకటే ముందు 48 గంటలకు ముందే అంటే డిసెంబరు 5వ తేదీ సాయంత్రం 5 గంటలకే ప్రచారం పరిసమాప్తంకానుంది. సో.. ఎన్నికల ప్రచారానికి సరిగ్గా 15 రోజుల సమయం మాత్రమే మిగిలివుంది. అందుకే ప్రచారాన్ని ఉధృతం చేసేందుకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ప్రత్యర్థిని తలదన్నేలా.. హామీలు, విమర్శలు, ప్రతి విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేసేలా అస్త్రశస్త్రాలతో రంగంలోకి దూకేందుకు రెడీ అవుతున్నాయి. 
 
అధికార తెరాస తరపున ఆ పార్టీ అధినేత కేసీఆర్ సోమవారం నుంచే పూర్తి స్థాయి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇక మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు సుడిగాలి పర్యటనలతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తెరాస గెలుపునకు కేటీఆర్ రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. అలాగే, బుధవారం నుంచి 29వ తేదీ వరకు ఆయన రోజుకు 2 నియోజకవర్గాల చొప్పున ప్రచారం చేయనున్నారు. 
 
ఇకపోతే, జాతీయ పార్టీ కాంగ్రెస్ తరపున ఈనెల 27, 29, డిసెంబరు 3వ తేదీల్లో ప్రచారానికి రానున్నారు. అలాగే, 23వ తేదీన మేడ్చల్‌లో జరిగే బహిరంగ సభలో యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ పాల్గొననున్నారు. మహాకూటమి తరపున రాహుల్, చంద్రబాబులతో పాటు.. మరికొందరు జాతీయ నేతలు కలిసి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రచారం చేయనున్నారు. అలాగే, 18 నియోజకవర్గాల్లో వారిద్దరూ రోడ్‌షోలు నిర్వహించనున్నారు. 
 
మరో జాతీయ పార్టీ బీజేపీ తరపున ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఈనెల 25, 27, 28 తేదీల్లో ప్రచారానికి రానున్నారు. తన వెసులుబాటును బట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ప్రచారానికి వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే, లెఫ్ట్ పార్టీల నేతలు సురవరం సుధాకర్ రెడ్డి, సీతారాం ఏచూరి, బీవీ రాఘవులు, బృందాకారత్, తమ్మినేని వీరభద్రం వంటి నేతలతో పాటు ఎంఐఎం నేతలు అసదుద్దీన్, అక్బరుద్దీన్‌లు ప్రచారం చేయనున్నారు.