మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 డిశెంబరు 2020 (16:43 IST)

సీఎం కేసీఆర్‌ను జైలుకు పంపుతామంటున్న బీజేపీ నేత!

తెలంగాణ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ నేతలు దూకుడు పెంచారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలతో పాటు..  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లభించిన విజయంతో బీజేపీ నేతలు మాటల తూటాలు పేల్చుతున్నారు. ముఖ్యంగా, అధికార తెరాస అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని చెలరేగిపోతున్నారు. 
 
తాజాగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో తెరాస చీఫ్, సీఎం కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పెద్దల పిలుపు మేరకు హస్తిన పర్యటనకెళ్లిన ఆయన... అక్కడ మీడియాతో మాట్లాడారు. 
 
'కోతల రాయుడు ఢిల్లీ వెళ్తారని ముందే చెప్పాం. వంగి.. వంగి.. పొర్లి దండాలు పెట్టినా మేము క్షమించం. ప్రజల దృష్టి మరల్చడానికే కేసీఆర్ ఢిల్లీ పర్యటన. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ప్రజలు చావు దెబ్బ కొట్టారు. లోపల జరిగేది ఒకటి.. కేసీఆర్ బయట చెప్పేది ఇంకొక్కటి. 
 
వరదల సమయంలో కేసీఆర్ ఫాంహౌస్ వదిలి బయటకు రాలేదు. కాళేశ్వరం మూడో టీఎంసీ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం. కాళేశ్వరానికి తక్కువ సమయంలో కేంద్రం అనుమతులిచ్చిందని కేసీఆరే చెప్పారు. కాళేశ్వరం అంచనాలను అడ్డగోలుగా పెంచారు. ప్రశ్నిస్తే మా రాష్ట్రం.. మా నిధులంటారు.. రాష్ట్రం మీ అయ్య జాగీరా?' అంటూ బండి సంజయ్ సూటిగా ప్రశ్నించారు.