శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శనివారం, 3 మార్చి 2018 (21:40 IST)

కేసీఆర్ - చంద్రబాబు ప్లాన్... తెరపైకి తృతీయ ఫ్రంట్...?

దేశ రాజకీయాల్లో పెను పరివర్తన (మార్పు) రావాలంటూ, అదీ కూడా ప్రజల్లో నుంచే రావాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ మార్పు కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తనవంతు ప్రయత్నం

దేశ రాజకీయాల్లో పెను పరివర్తన (మార్పు) రావాలంటూ, అదీ కూడా ప్రజల్లో నుంచే రావాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ మార్పు కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తనవంతు ప్రయత్నం చేస్తామని తెలిపారు. ముఖ్యంగా, పలువురు జాతీయ నేతలను కలిసి ఇదే అంశంపై చర్చించనున్నట్టు తెలిపారు. 
 
ఆయన శనివారం ప్రగతి భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ, ప్రస్తుత రాజకీయ వ్యవస్థ దారుణంగా విఫలమైందని.. దేశ రాజకీయాల్లో ప్రబలమైన మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనన్నారు. పథకాల పేరు మార్చడం మినహా కాంగ్రెస్, బీజేపీ ఎవరొచ్చినా క్షేత్రస్థాయి పరిస్థితుల్లో మార్పు లేదన్నారు. భారత రాజకీయాల్లో మార్పు కోసం కొత్త ప్రయాత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు. పరిస్థితులు వచ్చినప్పుడు నాయకుడు పుడతాడు. మార్పు విషయంలో నాయకత్వం వహించాల్సి వస్తే ఖచ్చితంగా వహిస్తానని వెల్లడించారు. 
 
దేశ రాజకీయాల్లో ప్రబలమైన మార్పు కోసం ప్రయత్నిస్తానని తెలిపారు. రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ఎవరితో మాట్లాడాలో వారితో మాట్లాడుతున్నట్లు చెప్పారు. మూడో కూటమి కావొచ్చు, మరో ఫ్రంట్ కావొచ్చు, కేంద్రంలో గుణాత్మకమైన మార్పు రావాలని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. 
 
కాగా, ఇటీవల టీ టీడీపీ నేతలతో జరిగిన కీలక సమావేశంలో కూడా ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా బీజేపీతో పొత్తుపై సంచలన వ్యాఖ్యలుచేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండబోదని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయన పార్టీ నేతలకు సంకేతాలు ఇచ్చారు. ఇదే విధానాన్ని ఏపీలో కూడా ఆయన అనుసరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అదేసమయంలో కేసీఆర్, చంద్రబాబులు కలిసి జాతీయ స్థాయిలో మూడో ఫ్రంట్ కోసం కృషి చేయవచ్చన్న ఊహాగానాలు వినొస్తున్నాయి.