శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Eswar
Last Modified: శనివారం, 26 జులై 2014 (19:24 IST)

టి. పిసిసి పగ్గాలు భట్టికి దక్కేనా...?

ఖమ్మం జిల్లాకే టి.పిసిసి పీఠం దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దళిత నేతగా, అన్ని వర్గాలను కలుపుకుని పోయే నాయకుడిగా పేరున్న మల్లు భట్టి విక్రమార్కకు టిపిసిసి పీఠం దక్కనుందని ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై మల్లు భట్టి అనుకూల వర్గాలు డిల్లీలో లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం..
మల్లు కుటుంభానికి కాంగ్రెస్ అధిష్టానంతో మంచి సంబంధాలు ఉండటంతో భట్టి పేరు తాజాగా తెరమీదకొచ్చింది. ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను మార్చాలంటూ అధిష్టానంపై ఒత్తిడి వస్తున్న నేపధ్యంలో పిసిసి పదవి కోసం టి. కాంగ్రెస్ పెద్దలంతా తీవ్రంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే అధిష్టానం ఆశీస్సులు భట్టి వైపే ఉంటాయంటున్నారు విశ్లేషకులు.
 
ఇప్పటికే గతవారం రోజులుగా డిల్లీలో మల్లు భట్టి విక్రమార్క తన వంతుగా పిసిసి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ స్పీకర్‌గా పని చేయగా, పిసిసిలో కూడా కీలకపాత్ర పోషించారు. పిసిసి మ్యానిపెస్టోలో భట్టి తనదైన ముద్ర వేశారు. ఖమ్మం జిల్లాలో పార్టీని నడిపించడంలో కీలకంగా పని చేసిన భట్టికి ఇప్పుడు పిసిసి పీఠం దక్కుతుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. టిఆర్ఎస్, జగన్ ప్రభంజనంలో కూడా మల్లు భట్టి విక్రమార్క మధిర నియోజవర్గం నుంచి రెండోసారి గెలుపొందటం భట్టికి కలిసొచ్చే సానుకూల అంశంగా పేర్కొంటున్నారు. 
 
దళిత వర్గానికి చెందిన వ్యక్తికి ఈసారి పిసిసి పీఠాన్ని ఇవ్వాలని కూడా కాంగ్రెస్ కోర్ కమిటీ నిర్ణయించినట్లు ప్రచారంలో ఉన్న నేపధ్యంలో యువకుడిగా ఉన్న మల్లుకే ఆ ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే మల్లు భట్టి విక్రమార్కకు తెలంగాణ,ఆంధ్రా ఇరు ప్రాంత నాయకులతోనూ సత్సంబంధాలు ఉండటం కూడా కలిసొచ్చే అంశం. మొత్తానికి పిసిసి పగ్గాలు భట్టి చేతిలోకి రానున్నట్టు ప్రచారమైతే ఊపందుకున్నది.