1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 15 ఫిబ్రవరి 2020 (13:23 IST)

తెలంగాణ ఆర్టీసీ.. నష్టాల నుంచి లాభాల్లోకి .. కారణం ఏంటీ?

ఆర్టీసీ నష్టాల నుంచి లాభాల బాటలోకి అడుగుపెడుతోంది. 2019 డిసెంబర్​ నెలను ఆర్టీసీ చరిత్రలో లిఖించదగినదిగా అధికారులు అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా లాభాలను అందుకుంది. ఇంతకుముందు ఆర్టీసీ రోజుకు రూ. 2 కోట్ల వరకు నష్టాలు రాగా.. గతేడాది డిసెంబర్​లో రోజుకు కోటి వరకు లాభాల్ని అర్జించింది. ఆర్టీసీ సంస్థ లాభాల్లోకి అడుగుపెట్టింది.

ఇందుకు 2019 డిసెంబర్ నెల వేదికయ్యింది. ఈ నెలలో ఆర్టీసీకి ఏకంగా రూ. 32.01 కోట్ల లాభాలు వచ్చాయి. 2018 డిసెంబర్​లో మాత్రం 72.84 కోట్ల నష్టం వాటిల్లింది.

ఒక్క ఏడాదిలో ఆర్టీసిలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా సమ్మె తర్వాత ఉద్యోగుల్లో చాలా మార్పు కన్పిస్తోంది. అధికారులు అనేక సంస్థాగత నిర్ణయాలు తీసుకున్నారు.

ఆర్టీసీ లాభాల్లోకి వచ్చేందుకు ప్రధాన కారణం ఛార్జీలు పెంచడమే. ఈ పెంపుతో ఏడాదికి సుమారు రూ. 750 కోట్ల అదనపు ఆదాయం లభిస్తుందని అధికారులు అంచనా వేశారు.

ఊహించినట్లుగానే ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసం చాలా తగ్గింది. ఛార్జీల పెంపుతో ఆర్టీసీకి నిజంగానే ఊరట లభించింది.

2018 అక్టోబర్​లో 356 కోట్లు, నవంబర్​లో 461.06 కోట్లు, డిసెంబర్​లో 533.90 కోట్లను అర్టీసి నష్టాలను మూటగట్టుకుంది. 2019 అక్టోబర్​లో 486.62 కోట్లు, నవంబర్​లో 436.43 కోట్లు, డిసెంబర్​లో 404.42 కోట్లు నష్టాలు తగ్గాయి.

అంటే గతేడాదితో పోల్చితే.. లాభాల్లోకి అడుగుపెట్టినట్లే అని అధికారులు భావిస్తున్నారు. జనవరి నెలలో సంక్రాంతి పండుగ, ఫిబ్రవరిలో సమ్మక్క-సారక్క జాతరతో ఖచ్చితంగా లాభాలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.