శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : బుధవారం, 30 నవంబరు 2016 (19:25 IST)

తెలంగాణలో నయీం పాలన.. నయీంలా కేసీఆర్ భూములు గుంజుకుంటున్నారు : కోదండరాం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన ప్రభుత్వ పాలనపై టీజేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ సారథ్యంలోని తెరాస ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో నయీం పాలన సాగుతోందని మండిపడ్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన ప్రభుత్వ పాలనపై టీజేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ సారథ్యంలోని తెరాస ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో నయీం పాలన సాగుతోందని మండిపడ్డారు. గ్యాంగ్‌స్టర్ నయీం భూములు గుంజుకున్నట్లు కేసీఆర్ సర్కార్ కూడా భూములు లాక్కుంటున్నారంటూ ధ్వజమెత్తారు. 
 
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం భూ నిర్వాసితుల సదస్సు జరిగింది. ఇందులో పాల్గొన్న కోదండరాం మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి ప్రాజెక్టులు అవసరమే కానీ వాటికి పక్కా ప్రణాళిక ఉండాలి, ప్రజలతో సంప్రదింపులు జరిపి భూములు తీసుకోవాలని సూచించారు. 
 
ప్రజల భాగస్వామ్యంతో నిపుణులతో చర్చించి ప్రాజెక్టులు రూపకల్పన చేయాలి లేదంటే ప్రాజెక్టులను వెంటనే ఆపాలన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో మెట్టు దిగిరాకపోతే వచ్చే నెల అసెంబ్లీ సమావేశాల సమయంలో ఇందిరా పార్కు వద్ద భారీ ధర్నా నిర్వహిస్తామన్నారు. ఈ ధర్నాకు రైతులు భారీసంఖ్యలో హాజరు కావాలని కోరారు. 
 
కాగా, ఈ సదస్సులో ప్రకటించిన తీర్మానాలు 
1.రాష్ట్ర ప్రభుత్వం నీటి పారుదల ప్రాజెక్టులకు, పరిశ్రమలకు దౌర్జన్యంగా భూములు తీసుకోవద్దు. దబాయింపులతో భూములను గుంజుకునే విధానానికి స్వస్తిచెప్పాలి.
2. డీపీఆర్ లేకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్టులకోసం భూములు తీసుక్కోవద్దు.
3.నష్టపరిహారం ప్రజలు కోరుకున్నట్లు ఇవ్వాలి. భూమికి భూమి సేకరించి సర్కారే ఇవ్వాలి. డబ్బులిచ్చి చేతులు దులుపుకుంటామంటే కుదరదు.
4. భూములు కోల్పోయో రైతులతో పాటు వాటిపై ఆధారపడే వృత్తి దారులకు పరిహారం ఇవ్వాలి.
5. ప్రాజెక్టుల వల్ల భూములు కోల్పోతున్న రైతులకు ఆ ప్రాజెక్టుల ప్రయోజనాల్లో భాగస్వాములను చేయాలి.
6. 2013 జాతీయ భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి.
7.అన్ని రకాల భూములకు ఏవిధమైన తేడా లేకుండా పరిహారం ఇవ్వాలి.