గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 అక్టోబరు 2019 (15:51 IST)

డీఎంకేకు షాకిచ్చిన తమిళ ఓటర్లు : ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకేకు పట్టం

తమిళనాడు రాష్ట్రంలో రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఓటర్లు డీఎంకేకు తేరుకోలేని షాకిచ్చారు. ఈ రెండు స్థానాల్లో అన్నాడీఎంకే అభ్యర్థులు గెలుపుబావుటా ఎగురవేశారు. దీంతో అన్నాడీఎంకే శ్రేణులు ఆనందోత్సవాల్లో మునిగిపోయాయి. 
 
నిజానికి గత సార్వత్రిక ఎన్నికల్లో అన్నాడీఎంకేను చావుదెబ్బ కొట్టిన ఓటర్లు... డీఎంకేకు పట్టం కట్టారు. తమిళనాడుతో పాటు.. పుదుచ్చేరిలలో ఉన్న 40 లోక్‌సభ స్థానాల్లో ఏకంగా 39 ఎంపీ సీట్లను డీఎంకే కూటమికి కట్టబెట్టారు. కేవలం ఒకే ఒక స్థానంలోనే అన్నాడీఎంకే అభ్యర్థి విజయం సాధించారు. 
 
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని నంగునేరి, విక్రవాండి అసెంబ్లీ నియోజకవర్గాలకు అక్టోబరు 21వ తేదీన ఉప ఎన్నికలు జరిగాయి. అయితే ఈ రెండు స్థానాల్లో అధికార పార్టీ అన్నా డీఎంకే ఆధిక్యంలో ఉన్నట్లు నేటి ఫలితాలు వెల్లడిస్తున్నాయి. గురువారం ఉదయం 8 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. కాగా, పోలింగ్ ప్రారంభం నుంచి అన్నా డీఎంకే అభ్యర్థులు లీడింగ్‌లో ఉంటూ వచ్చారు. 
 
ఈ క్రమంలో విక్రమాండిలో పోటీ చేసిన అన్నాడీఎంకే అభ్యర్థికి 113428 ఓట్లు వచ్చాయి. అలాగే, నాంగునేరిలో 94562 ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి డీఎంకే అభ్యర్థికి విక్రమాండిలో 68646 ఓట్లు రాగా, నాంగునేరిలో 62229 ఓట్లు వచ్చాయి. దీంతో అన్నాడీఎంకేకు చెందిన ఇద్దరు అభ్యర్థులు ఘన విజయం సాధించారు. గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి ఎడప్పాడి పాలనపై వచ్చిన ఆరోపణలన్నీ ఈ ఫలితాలు పటాపంచలు చేశాయని చెప్పొచ్చు. 
 
నిజానికి సార్వత్రిక ఎన్నికల తరహాలోనే ఈ ఉప ఎన్నికలో కూడా డీఎంకే గెలుస్తుందని చాలా వరకు రాజకీయ జోస్యాలు వెలువడ్డాయి. అయితే వాటన్నిటినీ తోసి రాజని అన్నాడీఎంకే జయకేతనం ఎగురవేసింది. అనేక రాజకీయ డ్రామాల తర్వాత పట్టు నిలుపుకున్నప్పటికీ వరుసగా ఎదురు దెబ్బలతో కొట్టు మిట్టాడుతూ వస్తున్న అన్నాడీఎంకేకు ఈ ఉప ఎన్నిక జీవం పోసినట్టయింది. మరి 2021లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి పట్టం కడతారో వేసి చూడాలి.