శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 అక్టోబరు 2020 (09:08 IST)

టీఎస్ఆర్టీసీ దసరా స్పెషల్స్... ఎంజీబీఎస్‌లోని ఫ్లాట్‌ఫారాల్లో కూడా మార్పులు

దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సులను నడుపనుంది. ఈ బస్సులు ఒక్క తెలంగాణ రాష్ట్ర పరిధిలోని నడుస్తాయి. ఏపీలోని వివిధ ప్రాంతాలకు తిరిగే అవకాశం లేదు. ముఖ్యంగా, పండగ సీజన్‌లో ఏర్పడే రద్దీని నివారించేందుకు వీలుగా ఈ బస్సులను నడుపనున్నారు. 
 
ప్రధానంగా జంట నగరాల నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేస్తున్నది. ఈ ఏడాది 3000 అదనపు బస్సులు నడుపేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. రద్దీకి అనుగుణంగా మరిన్ని బస్సులు పెంచి ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరుస్తామని టీఎస్‌ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్‌ ఆర్‌ఎం వరప్రసాద్‌ వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, దసరా పండుగ నేపథ్యంలో వివిధ రూట్లలో అధికారులు పలు మార్పులు చేసినట్టు చెప్పారు. కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ జిల్లాల వైపు వెళ్లే షెడ్యూల్‌, స్పెషల్‌ బస్సులు జూబ్లీ బస్‌స్టేషన్‌, జేబీఎస్‌ నుంచి నడుస్తాయన్నారు. 
 
యాదగిరిగుట్ట, జనగాం, పరకాల, నర్సంపేట, మహబూబాబాద్‌, తొర్రూర్‌, వరంగల్‌ వైపు వెళ్లే బస్సులు ఉప్పల్‌ క్రాస్‌రోడ్‌, ఉప్పల్‌ బస్‌ స్టేషన్‌ నుంచి నడువనున్నాయి. మిర్యాలగూడ, నల్గొండ, కోదాడ, సూర్యాపేట వైపు వెళ్లే బస్సులు దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి నడుస్తాయని తెలిపారు. 
 
అంతేకాకుండా, హైదరాబాద్ నగరంలోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్)లో బస్సులు వచ్చి ఆగి వెళ్లే ఫ్లాట్‌ఫారాల్లో కూడా మార్పులు చేశారు. ఫ్లాట్‌ ఫారం 10 నుంచి 13 వరకు ఖమ్మం, 14-15 దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌బీ నగర్‌కు, 18,19 ఉప్పల్‌క్రాస్‌ రోడ్‌కు, 23-25 వరకు పాతాల గంగ, కల్వకుర్తి వైపు, 26-31 రాయచూర్‌ వెళ్లే బస్సులు వచ్చి ఆగుతాయి. 
 
అలాగే, మహబూబ్‌నగర్‌ వైపు, 32-34 నాగర్‌ కర్నూల్‌, షాద్‌నగర్‌ వైపు, 35-36  రామాపురం వైపు, 41-42 పెబ్బేర్‌, కొత్తకోట, గద్వాల్‌ వైపు, 46-47 మెదక్‌, బాన్సువాడ, బోధన్‌ వైపు, 48-52 జహీరాబాద్‌, బీదర్‌, సంగారెడ్డి, నారాయణ్‌ఖేడ్‌ వైపు, 53-55 జేబీఎస్‌ వైపు, 56-58 నాగ్‌పూర్‌, అమరావతి, నాందేడ్‌, అకోలా(మహారాష్ట్ర) బస్సులు, 62 దేవరకొండ వైపు, 63-65 పరిగి, తాండూరు, వికారాబాద్‌ వైపు షెడ్యూలు, స్పెషల్‌ బస్సులు నడుపనున్నారు. 
 
అదేవిధంగా మహాత్మా గాంధీ బస్‌స్టేషన్‌, జూబ్లీ బస్‌స్టేషన్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కేపీహెచ్‌బీ, ఎస్‌ఆర్‌ నగర్‌, అమీర్‌పేట్‌, టెలిఫోన్‌ భవన్‌, ఈసీఐఎల్‌, ఉప్పల్‌ క్రాస్‌రోడ్‌, ఎల్‌బీ నగర్‌తోపాటు జంటనగరాల్లోని శివారు ప్రాంతాల్లో నివసించే వారికి సమీపంలోని ముఖ్యమైన పాయింట్ల నుంచి, ఆధీకృత టికెట్‌ బుకింగ్‌ ఏజెంట్ల వద్ద ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే, ఈ నెల 22 నుంచి 24 వరకు నడిపే బస్సులకు అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ సౌకర్యాన్ని కల్పించారు. 
 
ఇకపోతే, పాయింట్ల వివరాలు తెలుసుకునేందుకు వీలుగా ఫోన్ హెల్ప్ నంబర్లను కూడా ప్రకటించింది. ఎంజీబీఎస్‌ -8330933537, జేబీఎస్‌-040-27802203, జీడిమెట్ల ఏజెంట్‌-9866090717, ఆరాంఘర్‌ ఏజెంట్‌-9059500217, హబ్సిగూడ ఏజెంట్‌-9849641808, దిల్‌సుఖ్‌నగర్‌-040-23747297, కేపీహెచ్‌బీ ఏజెంట్‌-9490484232, ఇసీఐఎల్‌ ఏజెంట్‌-9866270709, ఎస్‌ఆర్‌ నగర్‌ ఏజెంట్‌ - 9866933312, అమీర్‌పేట్‌ ఏజెంట్‌-9949958758 ఇలా మరికొందరు ఏజెంట్ల నంబర్లను కూడా ప్రకటించారు.