శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సందీప్ రేవిళ్ళ
Last Modified: గురువారం, 28 ఫిబ్రవరి 2019 (19:41 IST)

బర్త్ డే పార్టీ... తాగిన మత్తులో అలా చేశామన్న యువకులు...

మందుబాబులు తాగితే ఏం చేస్తారో వారికే తెలియదు. దొంగతనాలకు కూడా పాల్పడుతుంటారు. ఫ్రెండ్ బర్త్‌డే పార్టీకి వెళ్లి ఫుల్లుగా తాగి మొబైల్ దొంగతనం చేశారు. పోలీసులు వారిని పట్టుకోగా తమకు ఏమీ తెలియదని చెప్పారు. హైదరాబాద్ వెస్ట్ మారేడుపల్లి ఏరియాలో ఉండే శివశంకర్, కార్తీక్ మరో స్నేహితుడు ఇచ్చిన బర్త్‌డే పార్టీకి వెళ్లారు. అక్కడ ఫుల్లుగా మందేసి వీధుల్లోకి వచ్చారు. 
 
అలా నడిచి వెళుతుండగా గోపాలపురం ఏరియాలో రాము అనే వ్యక్తి కనిపించాడు. రాము ఫోన్ మాట్లాడుతుండటం చూసి ఫోన్ కొట్టేయాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. కాల్ చేసుకోవాలి మొబైల్ ఇస్తారా, మా ఫోన్‌లో బ్యాటరీ అయిపోయిందని రాముని అడిగారు. అతను మొబైల్‌ని కార్తీక్ చేతికి ఇచ్చాడు. ఇంతలో శివశంకర్ అతడిని మాటల్లో పెట్టాడు. ఫోన్ తీసుకున్న కార్తీక్ అటునుండి అటే పరారయ్యాడు. 
 
రాము అతడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా శివశంకర్ కూడా అక్కడ నుండి పరారయ్యాడు. రాము వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరిపి నిందితులను 24 గంటల లోపే పట్టుకున్నారు. నిందితుల నుండి ఫోన్‌ని స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిని విచారించారు. తమ వద్దకు సెల్ ఫోన్ ఎలా వచ్చిందో తెలియదని, స్నేహితుని పార్టీకి వెళ్లి తాగి వచ్చి రూమ్‌లో పడుకున్నామని చెప్పారు. వారికి సీసీ టీవీ ఫుటేజీ చూపించగా తాగిన మత్తులో ఇలా చేశామని ఒప్పుకున్నారు. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.