శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 నవంబరు 2020 (10:35 IST)

కాషాయం కండువా కప్పుకోనున్న రాములమ్మ!

సీనియర్  సినీ నటి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్ విజయశాంతి పార్టీ మారనున్నారు. ఈ మేరకు ఆమె స్పష్టమైన సంకేతాలు పంపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ఆమె కాంగ్రెస్ పార్టీకి భారీ షాకిచ్చి కమలం పార్టీలో చేరనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసుకున్నారు. 
 
తన చేరికలో భాగంగా, ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఓ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఆపై ఢిల్లీలో పార్టీ కేంద్ర నేతలతో ఆమె భేటీ అవుతారు. ఈ విషయాన్ని బీజేపీ వర్గాలు కూడా స్పష్టం చేశాయి. ఢిల్లీ నుంచి రాగానే, ఆమె జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోరుతూ విస్తృతంగా ప్రచారం చేస్తారని ప్రకటించారు. 
 
కాగా, గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న రాములమ్మ, దుబ్బాక ఎన్నికల సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమై తన చేరికపై మంతనాలు జరిపారు. ఆపై తన అనుచరులతో సమావేశమైన విజయశాంతి, బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. విజయశాంతికి బీజేపీ రాష్ట్ర శాఖలో కీలకమైన బాధ్యతలనే అప్పగిస్తారని సమాచారం.
 
ఏది ఏమైనా విజయశాంతి రాజకీయ ప్రస్థానం అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. తొలుత బీజేపీలో చేరిన ఆమె ఆ తర్వాత సొంతంగా పార్టీని స్థాపించారు. ఆ తర్వాత దాన్ని తెరాసలో విలీనం చేసి మెదక్ లోక్‌సభకు తెరాస నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కానీ, తెరాస చీఫ్ కేసీఆర్‌తో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇపుడు ఆ పార్టీ నుంచి వైదొలగి బీజేపీలో చేరనున్నారు.