శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: గురువారం, 15 జూన్ 2017 (14:26 IST)

ఆ ఫామ్‌హౌస్‌కు బ్యూటీషియన్ శిరీష... అర్థరాత్రి 1.48కి భర్తకి సందేశం... ఇతడు సైలెంట్?

బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య మిస్టరీ మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తోంది. ఎస్సై ప్రభాకర్ రెడ్డి తన రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం, అంతకుముందు రోజు శిరీష శవమై హైదరాబాదులోని తన బ్యూటీ సెంటర్లో కనిపించడానికి లింకులు వున్నట్లు ప్రాథమికంగా తేలింద

బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య మిస్టరీ మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తోంది. ఎస్సై ప్రభాకర్ రెడ్డి తన రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం, అంతకుముందు రోజు శిరీష శవమై హైదరాబాదులోని తన బ్యూటీ సెంటర్లో కనిపించడానికి లింకులు వున్నట్లు ప్రాథమికంగా తేలింది. ఐతే అసలు శిరీష కుకునూరుపల్లికి ఎందుకు వెళ్లిందనే దిశగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు మరో క్లూ దొరికింది. 
 
అదేమిటంటే... సోమవారం అర్థరాత్రి గం 1.48 నిమిషాలకు శిరీష తన వాట్స్ యాప్ ద్వారా భర్త సతీష్ చంద్రకు ఓ మెసేజ్ పెట్టింది. ఆ సందేశంలో గూగుల్ మ్యాప్ పెట్టింది. అది ఓ ఫామ్ హౌస్ నుంచి వచ్చినట్లు పోలీసులు కనుగొన్నారు. ఆ హౌస్ అక్కడే వున్న హనుమాన్ టెంపుల్ కు దగ్గర్లో వున్నట్లు స్పష్టమైంది. 
 
కాగా తనకు సందేశం రాగానే ఆమెకు తిరిగి ఫోన్ చేశాననీ, ఐతే నాట్ రీచబుల్ అని రాగానే... సర్లే ఉదయాన్నే వస్తుందని తనపాటికి తను నిద్రపోయినట్లు చెప్పుకొచ్చాడు. ఐతే ఆ తర్వాత మళ్లీ 4 గంటలకు మెళకువ వచ్చి ఫోన్ చేసినా నాట్ రీచబుల్ అని వచ్చినట్లు తెలిపాడు. ఇకపోతే ఆమె అర్థరాత్రి అలా సందేశం పెట్టినప్పుడు భర్త మౌనంగా ఎందుకు వుండిపోయాడన్నది ఓ ప్రశ్నగా మారింది.
 
కాగా తన భార్యతో షాపు ఓనర్ రాజీవ్ వున్నట్లు తేలింది కనుక అతడిని పూర్తిగా విచారిస్తే మొత్తం వ్యవహారమంతా బయటపడుతుందంటున్నాడు సతీష్. అసలు కుకునూర్ పల్లి ఫార్మ్ హౌసుకు ఆ సమయంలో శిరీష ఎందుకు వెళ్లినట్లు అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆ ఫామ్ హౌసులో ఏం జరిగిందన్నది తెలియాల్సి వుంది. 
 
శిరీష ఫోన్ లిప్ట్ చేయకపోవడం చూస్తుంటే.. ఆమెను అక్కడే చంపేసి ఆ తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చి ఆత్మహత్యగా చిత్రించారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆ ఫామ్ హౌస్ హైదరాబాదుకు చెందిన రషీద్ అనే వ్యక్తిదని తేలింది. మొత్తం ఈ వ్యవహారంలో ఎంతమంది తలదూర్చారన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లభ్యమవుతున్న ఆధారాలను బట్టి కేసు త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశం వుందంటున్నారు.