ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: సోమవారం, 4 నవంబరు 2019 (20:06 IST)

ఉత్తమ ఎమ్మార్వో విజయా రెడ్డిపై ఎందుకిలా? భద్రత డొల్లతనం

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయా రెడ్డి సజీవ దహనం తీవ్ర సంచలనం సృష్టించింది. సమయపాలన, క్రమశిక్షణ ఆమెకి ప్రాణం. ఎక్కడా అవినీతికి తావులేకుండా పనిచేసే ఎమ్మార్వో విజయారెడ్డి గత ఏడాది ఉత్తమ ఎమ్మార్వోగా ఎంపికై కలెక్టర్ నుంచి ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. అటువంటి అధికారిణిపై దారుణానికి పాల్పడి సజీవ దహనం చేశాడు సురేష్ అనే రైతు. 
 
పైగా ఆమె తన భూమి రిజిస్ట్రేషన్ విషయంలో వేధించారనీ, డబ్బులు అడిగారంటూ నిందితుడు ఆరోపిస్తున్నాడు. ఐతే ఉత్తమ ఎమ్మార్వోగా వున్న విజయారెడ్డిపై నిందితుడు చేసిన ఆరోపణలను ఖండించింది ఎమ్మార్వోల సంఘం. మరోవైపు ఓ వ్యక్తి కిరోసిన్ బాటిల్‌తో లోపలికి, అదికూడా ఓ మేజిస్ట్రేట్ అధికారిణి వద్దకు వెళ్లాడంటే అక్కడ భద్రత ఎంత డొల్లతనంగా వుందో అర్థమవుతుంది.
 
విజయా రెడ్డి విద్యార్థిని స్థాయి నుంచే పట్టుదల కలిగిన యువతి అని ఆమె తండ్రి చెప్పారు. తొలుత ఉపాధ్యాయురాలిగా పనిచేసిన ఆమె ఆ తర్వాత ఎంతో కష్టపడి గ్రూప్ 2 పరీక్ష రాసి ఉత్తీర్ణురాలయ్యారు. అప్పటికే ప్రభుత్వ ఉపాధ్యాయురాలి పదవికి రాజీనామా చేసి ఎమ్మార్వోగా బాధ్యతలు చేపట్టారు. ఈమె సొంత వూరు నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం తోటపల్లి. ఆమె భర్త సుభాష్ రెడ్డి హయత్‌నగర్‌ ప్రభుత్వ కాలేజీలో డిగ్రీ కాలేజీ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.