గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (16:38 IST)

బీమా డబ్బు కోసం కారు డ్రైవరుతో కలిసి భర్తను ఏం చేసిందో తెలుసా?

రెండు నిమిషాలు గాలి కావాలా? రెండు కేజీల బంగారం కావాలా అంటే, గబుక్కున గాలి ఎవడిక్కాలి, బంగారమే కావాలని అంటారన్నట్లు, బతికున్న భర్త కంటే అతడి చనిపోయిన తర్వాత వచ్చే బీమా ముద్దు అనుకున్నది ఓ ఇల్లాలు. అంతే ఆమె తన భర్త అంతానికి పక్కా ప్లాన్ వేసి సక్సెస్ అయ

రెండు నిమిషాలు గాలి కావాలా? రెండు కేజీల బంగారం కావాలా అంటే, గబుక్కున గాలి ఎవడిక్కాలి, బంగారమే కావాలని అంటారన్నట్లు, బతికున్న భర్త కంటే అతడి చనిపోయిన తర్వాత వచ్చే బీమా ముద్దు అనుకున్నది ఓ ఇల్లాలు. అంతే ఆమె తన భర్త అంతానికి పక్కా ప్లాన్ వేసి సక్సెస్ అయింది. కాకపోతే బీమా సొమ్ము దక్కకపోగా కటకటాలు లెక్కిస్తోంది. 
 
వివరాల్లోకి వెళితే... తెలంగాణా రాష్ట్రంలోని హయత్‌నగర్‌ మండలం కమ్మగూడకు చెందిన కేశ్యానాయక్‌‌తో కేతావత్ పద్మకు పదేళ్ల క్రితం వివాహమైంది. ఐతే భర్త ప్రభుత్వ ఉద్యోగి. వివాహం జరిగి పదేళ్లు కావస్తున్నా పిల్లలు కలుగకపోవడంతో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో పెద్దలు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. ఐతే భార్యను వదిలేసి మరో మహిళను వివాహం చేసుకున్నాడతను. దాంతో ఈ విషయంపై పోలీసు కేసు పెట్టడంతో అది కోర్టులో నడుస్తోంది. కానీ భర్త నుంచి డబ్బు రాకపోగా ఇబ్బందులు ఎక్కువయ్యాయి. 
 
ఇదిలావుండగా కేశ్యానాయక్ ఇటీవల ఓ కారు కొని దాన్ని అద్దెకు తిప్పుతున్నాడు. తనకు అవసరం వున్నప్పుడు మాత్రం డ్రైవరుకు ఫోన్ చేసి కారులో వెళ్తుండటాన్ని పద్మ పసిగట్టింది. దానితో ఓ నిర్ణయానికి వచ్చేసింది. భర్తపై రూ. 50 లక్షలు బీమా వుండటంతో అతడిని ఎలాగైనా హతమారిస్తే డబ్బు తనకే వస్తుందని ఆలోచన చేసింది. దీనితో భర్త డ్రైవరు ఫోన్ నెంబరు తీసుకుని తన ప్లాన్ చెప్పేసింది. తన భర్తను చంపేస్తే తనకు రూ. 50 లక్షల బీమా డబ్బు వస్తుందనీ, అందులో కొంత డ్రైవరుకు ఇస్తానని చెప్పడంతో అతడా డీల్‌కు ఓకే చెప్పాడు.
 
ఆగస్టు 27న ముందస్తు అడ్వాన్సుగా రూ.15 వేలు ఇచ్చి భర్తను కడతేర్చాలని చెప్పింది. డబ్బు పుచ్చుకున్న కారు డ్రైవర్ వినోద్ ఆగస్టు 31న తన యజమాని కేశ్యానాయక్‌కు పూటుగా మద్యం తాగించి ఆ తర్వాత ఆ మత్తులో అతడిని కారులో కొంతదూరం తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు. ఐతే అది తెలిసిపోతుంది కనుక... కారును వేగంగా నడిపి ఇంజాపూర్ సమీపంలోని ఓ విద్యుత్ స్తంభానికి ఢీకొట్టాడు. 
 
కారు ప్రమాదం జరిగిందని తెలుసుకున్న అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి 108 సిబ్బంది వచ్చి చూస్తే కేశ్యానాయక్ మృతి చెంది వుండగా కారు డ్రైవరుకు మాత్రం రక్త మరకులు కూడా అంటలేదు. దీనితో అనుమానం వచ్చి పోలీసులు తమదైన శైలిలో విచారించారు. వినోద్ జరిగింది జరిగినట్లు చెప్పడంతో పద్మతో పాటు కారు డ్రైవర్ వినోద్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.