1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 జూన్ 2021 (16:29 IST)

ఆయనొస్తానంటే నేనొద్దంటానా : ఈటల రాకపై షర్మిల కామెంట్స్

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ తమ పార్టీలో చేరిక విషయంపై వైఎస్. షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈటల తమ పార్టీలో చేరాలని కోరారు. ఈటల వస్తానంటే ఆహ్వానిస్తామన్నారు. పార్టీ నాయకులతో లోటస్ పాండ్‌లో బుధవారం వైఎస్సార్ టీపీ విస్తృత స్థాయి సమావేశం నేడు జరిగింది. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కేసులకు భయపడి ఈటల బీజేపీలో చేరుతున్నారన్నారు. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చే వారిపై కేసులు పెట్టడం కామన్ అని, కేసులకు భయపడి బీజేపీలో చేరడం కూడా కామన్ అయిపోయిందన్నారు. తమ పార్టీలోకి ఈటల వస్తానంటే ఆహ్వానిస్తామన్నారు. ఇప్పటివరకు ఈటల విషయంలో ఎటువంటి చర్చ లేదని చెప్పారు.
 
వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతోనే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఉంటుందన్నారు. టేబుల్ ఫ్యాన్ గుర్తుపై ఫూలిష్ ప్రచారం జరుగుతోందంటూ ఖండించారు. ఇప్పటివరకు గుర్తు ఎంపికపై ఎటువంటి చర్చ జరగలేదన్నారు. 
 
ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని పార్టీ విధి, విధానాలు రూపొందిస్తామన్నారు. కరోనా విషయంలో ఇప్పటివరకు కేసీఆర్ పాఠాలు నేర్చుకోలేదన్నారు. కోవిడ్‌ను ఎదుర్కొనే ఉద్యేశ్యం కేసీఆర్‌కు లేదని, నిద్ర పోతున్నట్లు నటిస్తున్న వారికి ఏం చెప్పలేమన్నారు. 
 
తెలంగాణ సంక్షేమం కోసమే పార్టీ పెడుతున్నట్టు చెప్పారు. కార్యకర్తలకే పార్టీలో పెద్ద పీట వేయబోతున్నామని తెలిపారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ కష్టపడే కార్యకర్తలే రేపటి నాయకులు అని పేర్కొన్నారు. కార్యకర్తలు చెప్పిందే తన పార్టీ సిద్ధాంతమని షర్మిల పేర్కొన్నారు. 
 
అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. ప్రజల ఆశయాలకు అద్దం పట్టేలా పార్టీ విధానాలుంటాయన్నారు. పార్టీ పెట్టబోయే ఈ నెల రోజులు ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని షర్మిల పేర్కొన్నారు.