సినీకార్మికుల అసంతృప్తి...
ఎప్పటినుంచో సినీకార్మికులు తమ వేతనాలు పెంచమని ఛాంబర్ దృష్టికి తెచ్చినా మూడేళ్లుగా అతీగతీ లేదు. కానీ ఆఘమేఘాలపై బుధవారంనాడు ఓ పత్రికలో భారీ ప్రకటన చేసింది. సినీకార్మికుల వృత్తి నియమనిబంధనలు, వేతనాల వివరణాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్యమండలి బుధవారంనాడు పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన కార్మిక సమాఖ్య (ఫెడరేషన్) పెద్దల ముందు కూర్చుని చర్చించి చేశామని గురువారంనాడు ఛాంబర్ తెలియజేసింది.
కానీ ఆ సమావేశానికి ఫెడరేషన్ నుంచి ఎవ్వరూ హాజరుకాలేదు. దీనిపై ఛాంబర్ నాయకులు ఎన్విఎస్ ప్రసాద్, బూరుగుపల్లి శివరామకృస్ణ మాత్రం... వారి సమస్యలు అన్నీ పరిష్కరించాం. కానీ ఒక్క సమస్య కొలిక్కిరాలేదు. అదేమంటే.. చిన్న సినిమాలు నిర్మించే నిర్మాతలు అంత వేతనాలు ఇవ్వలేమన్నారు. పైగా నిర్మాత ఇష్టమైనవారిని కార్మికులుగా పెట్టుకొనే హక్కు వుంది. అది వద్దని ఫెడరేషన్ చెబుతోంది. దీన్ని మేం ఒప్పుకోలేదని చెప్పారు.
కాగా, ఫెడరేషన్ గురువారంనాడు సమ్మెకు పిలుపునిచ్చింది. దీనివల్ల షూటింగ్లు ఆగిపోయే ప్రమాదముంది. పైగా, తాము ఎప్పటినుంచో సమస్యలు చెబుతుంటే పట్టించుకోనివారు.. తుఫాన్ బాదితుల సహాయార్థం చేపట్టిన కార్యక్రమాలకు కార్మికులు హాజరు కాకపోవచ్చనీ, దీనివల్ల మొత్తం దెబ్బతింటుందని ఆఘమేఘాలపై వేతనాలు పెంచినట్లు సమాచారం.