సెన్సార్ కార్యక్రమాల్లో జగపతిబాబు కొత్త సినిమా 'హితుడు'
జగపతిబాబు, మీరా నందన్ ప్రధాన పాత్రధారులుగా సుంకర మధుమురళి సమర్పణలో కెఎస్వీ ఫిలింస్ పతాకంపై విప్లవ్ను దర్శకుడుగా పరిచయం చేస్తూ కెఎస్వీ నిర్మిస్తున్న విభిన్న చిత్రం 'హితుడు'. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాల్లో వుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత కెఎస్వీ సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత కెఎస్వీ మాట్లాడుతూ - ''చక్కని సందేశంతో రూపొందిన ఈ చిత్రంలో సందేశంతోపాటు ఒక కమర్షియల్ చిత్రానికి వుండాల్సిన అని ఎలిమెంట్స్ ఈ చిత్రంలో వున్నాయి. ఈ చిత్రం ద్వారా విప్లవ్ని దర్శకుడుగా పరిచయం చేస్తున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాల్లో వుంది. డిసెంబర్ 27 ఈ చిత్రం ఆడియోను రిలీజ్ చేసి, చిత్రాన్ని జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.
దర్శకుడు విప్లవ్ మాట్లాడుతూ - ''విద్య ద్వారా వ్యవస్థలో మార్పు తీసుకురావాలని అహర్నిశలు పరితపించే ఆదర్శ విలువలు కలిగిన సీతారామ్ పాత్రలో జగపతిబాబుగారు జీవించారు. అందరూ ఆదర్శంగా తీసుకోదగిన ఉన్నతమైన పాత్ర అది. మంచి సందేశంతోపాటు ఎంటర్టైన్మెంట్ని కూడా జోడించి ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంటుందన్న నమ్మకం నాకు వుంది'' అన్నారు.
జగపతిబాబు, మీరానందన్, బెనర్జీ, సి.వి.ఎల్.నరసింహారావు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కోటి, సినిమాటోగ్రఫీ: భరణి కె.ధరన్, పాటలు: అనంతశ్రీరామ్, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల, సమర్పణ: సుంకర మధుమురళి, నిర్మాత: కెఎస్వీ, కథ-స్క్రీన్ప్లే-మాటలు-దర్శకత్వం: విప్లవ్.