కోన వెంకట్ను దోచుకున్న దోపిడీ దొంగలు..! ఆలస్యంగా వెలుగులోకి..!
ప్రముఖ సినిమా రచయిత కోన వెంకట్ను దోపిడీ దొంగలు దోచుకున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 26న నటుడు ప్రకాష్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ శివార్లలోని ప్రకాష్రాజ్ ఫామ్ హౌస్లో వేడుకలు జరిగాయి.
వాటికి రచయిత కోన వెంకట్, మరికొందరు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. పార్టీ మూగిసిన తర్వాత రాత్రివేళ తిరిగి వస్తుండగా, కోన వెంకట్తోపాటు నిర్మాత డీవీవీ దానయ్య ప్రయాణిస్తున్న కారును కొంతమంది దొంగలు అడ్డుకున్నారు. వారి కారు అద్దాలను పగులగొట్టి వారి దగ్గర వున్న బంగారం, డబ్బు, సెల్ ఫోన్లు మొత్తం దోచుకున్నారు.
దోపిడీకి గురైన సొత్తు విలువ మూడు లక్షలు వుంటుందని సమాచారం. ఈ దోపిడీని చూసి వెనుక కార్లలో వస్తున్న మరికొందరు సినీ ప్రముఖులు తమ కార్లను వెనక్కి తిప్పుకుని వెళ్ళిపోయారని తెలుస్తోంది. ఈ దోపిడీ మీద కోన వెంకట్ ఫిర్యాదు మేరకు షాద్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు.
దీనికి సంబంధించి కోన వెంకట్ మాట్లాడుతూ.. ఈ దోపిడీ ఘటన తన జీవితంలో మరచిపోలేదని కోన వెంకట్ చెబుతున్నారు. డబ్బు పోతే పోయింది... ప్రాణాలు తీయలేదు అదే సంతోషం అని ఆయన తెలిపారు.