శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 27 జనవరి 2015 (15:44 IST)

సౌందర్య, రమ్యకృష్ణలతోనే హీరోయిన్ల నటన పోయింది... కోట శ్రీనివాసరావు

పద్మశ్రీ అవార్డు ఆలస్యంగా వచ్చిందని అడిగితే... వచ్చింది కదా... సంతోషం అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు నటుడు కోట శ్రీనివాసరావు. ఓ టెలివిజన్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... తనకు నచ్చిన నటులెవరూ అనడిగితే నలుగురైదుగురుకు మించి లేరని అన్నారు. పేర్లు మాత్రం చెప్పని కోట, ఇపుడున్న హీరోయిన్లకు అసలు నటనే తెలియదని తేల్చి చెప్పారు. 
 
సౌందర్య, రమ్యకృష్ణ వంటి హీరోయిన్లతోనే హీరోయిన్ల నటన పోయిందనీ, ఇపుడంతా డ్యాన్సులు... అంటూ తల పంకించారు. మొత్తమ్మీద మోడ్రెన్ హీరోహీరోయిన్లకు నటన అనేది తెలియకుండానే సినిమాల్లో నటించేస్తున్నారని కోట పరోక్షంగానే చురక అంటించారు. 
 
ఇకపోతే... కుటుంబ కథా చిత్రాలు అరుదుగా వస్తున్నాయనీ, అన్నీ ఒకే టైపు ఫార్ములాతో మూస ధోరణిలో వస్తున్నాయని చెప్పారు. డబ్బులున్నవారు అలాంటి చిత్రాలను తీస్తుంటే ప్రేక్షకులు మాత్రం చూడక ఏం చేస్తారంటూ పెదవి విరిచారు. తనకు మరో 15 సంవత్సరాల పాటు నటించాలనే కోరిక ఉన్నట్లు బహిర్గతం చేశారు.