నెలాఖరున 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని'.. మూవీ మొఘల్కు అంకితం..!
మూవీ మొఘల్, ప్రముఖ సినీ నిర్మాత రామానాయుడుకి ఓ ప్రేమ కథా చిత్రాన్ని అంకితమివ్వబోతున్నారు. కన్నడలో హిట్టు కొట్టిన చిత్రం 'చార్మినార్'. ఈ చిత్రాన్ని 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని' పేరుతో తెలుగులోకి రీమేక్ చేసిన విషయం తెలిసిందే. హీరో సుధీర్ బాబు, నందిత జంటగా నటించిన ఈ చిత్రం త్వరలో విడుదలకాబోతోంది.
ఈ చిత్ర విశేషాలను గురించి చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ తెలుపుతూ.. ఇదొక అద్భుతమైన ప్రేమకథా చిత్రం అని తెలిపారు. కనుక అనేక ప్రేమ కథా చిత్రాల రూపకర్త మూవీ మొఘల్ రామానాయుడుకి 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని' చిత్రాన్ని అంకితం ఇస్తున్నట్టు తెలిపారు.
నాయుడు గారంటే తనకెంతో గౌరవమని, ఆయన్ని ఆదర్శంగా తీసుకొనే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టానని తెలిపారు. ఆయన లేని లోటు ఎవ్వరూ తీర్చలేరంటూ శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 12న ప్లాటినమ్ డిస్క్ వేడుక నిర్వహిస్తున్నారు. ఈ నెలాఖరున చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపారు.