శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Updated : ఆదివారం, 29 మార్చి 2015 (15:31 IST)

అవార్డుకు పంపిస్తాననుకోలేదు: పసుపులేటి పూర్ణచంద్రరావు

ఇటీవలే కేంద్ర ప్ర్రభుత్వం ప్రకటించిన 62వ జాతీయ చలనచిత్రోత్సవాల్లో భాగంగా ఉత్తమ సినీ రచనుకుగాను పసుపులేటి పూర్ణచంద్రరావు రాసిన 'సైలెంట్‌ సినిమా'కు జాతీయ అవార్డు దక్కింది. 1895 నుంచి 1930 వరకు భారత సినిమా పరిణామక్రమ వికాసాలను మొదటిభాగంలోనే ఆసక్తికరంగా మలిచారు. అసలు ఇది మూడు భాగాలుగా తీయాలనుకున్నారు. ఇప్పటికే మొదటి భాగం విడుదలై అవార్డు పొందడం ఊహించలేదని ఆయన 
చెబుతున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూ... 
 
ప్రశ్న : సెలైంట్‌ సినిమాకు సైలెంట్‌గా అవార్డు రావడం ఎలా అనిపిస్తుంది? 
అసలు నేను రాసిన పుస్తకానికి అవార్డు వస్తుందనే నమ్మకం నాకులేదు. ఈ పుస్తకాన్ని అవార్డుకు పంపిచడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. పుస్తకాన్ని ఎమెస్కో సంస్థ పబ్లిషిక్‌ చేసింది. వారు నాలుగు నెలలక్రితం అవార్డుకు పంపాలని కోరితే.. కాపీలు లేవని చెప్పారు. తర్వాత అస్సలు పట్టించుకోలేదు. చివరి ఒక్కరోజు వుండగా... వారిని చెడామడా తిట్టేసి రచయితకు సహకరించని మీ సంస్థ ఎందుకు? అంటూ వారిదో వాగ్వివాదానికి దిగాను.. ఏమనుకున్నారో ఏమో.. సడెన్‌గా.. ఒక్కరోజు ముందుగా కాపీలు పంపారు. అవార్డుకు పంపాలంటే నాలుగు కాపీలు కావాలి... ప్రస్తుతం నా వద్ద ఒక్క కాపీవుంది. 
 
ప్రశ్న : ఇలా ఇబ్బంది పెట్టడానికి కారణమైనా ఆలోచించారా? 
ఒక్కటే... వారు కమర్షియల్‌ అయిపోయారు. పూర్ణ చంద్రరావు ఏదో రాశాడు. దానికి జాతీయ స్థాయి అవార్డుకు వస్తుందో రాదో.. ఎందుకనుకున్నారమో ఏమో.. అస్సలు నాకే నమ్మకంలేదు. 
 
ప్రశ్న : అవార్డుకు దక్కిన అంశాలేమిటని భావిస్తున్నారు? 
ఇది చదివితే మీకే తెలుస్తుంది. ఒక్క సినిమానేకాదు.. సినిమాకుముందు నాటకరంగం.. ఆ రంగం నుంచి సినిమా ఎలా పుట్టింది. ఫ్రాన్స్‌లో పుట్టిన సినిమా.. రష్యాలోనూ ఎలా వుంది. అలాగే వివిధ దేశాల్లో ఎలా వుంది? హిట్లర్‌ టైంలో ఎలాంది. లెనిన్‌కు సినిమా పట్ల ఆసక్తి ఎక్కువ.. అసలు ఆయన భార్యకు మరింత ప్రేమ సినిమా అంటే.. అందుకే ఆమెకు సినిమాకు సంబంధించిన శాఖను ఇచ్చి చూడమనేవాడు. కానీ పూర్తిస్థాయిలో సినిమా ఎదుగుదల చూడలేక అకస్మాత్తుగా చనిపోయారు. ఇలాంటివి ఎన్నో తెలీని విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు చర్చించాను. కెమెరా సంగీతం, 
ఎడిటింగ్‌ ఇలా ఒక్కోశాఖను పరిశీలించాను. 
 
ప్రశ్న : రచనకు దోహదపడిన అంశాలు? 
ఎక్కువగా పుస్తక ప్రియుడ్ని.. దేశదేశాలు తిరిగాను. అక్కడి పరిస్థితులు తెలుసుకున్నాను. చాలా దేశాలకు నాటకరంగంలో వర్క్‌షాప్‌లు నిర్వహించాను... అవార్డుకు పంపడానికి అక్కడివారికి అర్థం కావడానికి ఇంగ్లీషులో కూడా హెడ్డింగ్‌లు పెట్టి విశ్లేషించాను. 
 
ప్రశ్న : మీ నేపథ్యం? 
ఖమ్మంలో 1948లో జన్మించాను. తాతగారు ఏలూరు. అప్పుడే ఉర్దూ నేర్చుకున్నారు. దాని ద్వారా హైదరాబాద్‌లో నవాబు కాలంలో ఉద్యోగిగా మారారు. అప్పటినుంచి ఇక్కడే స్థిరవాసం.. 
 
ప్రశ్న : మీరు పనిచేసిన హోదాలు? 
అధ్యయనమే నా ఆశయం. అందుకే అంతర్జాతీయ సినిమా, అంతర్జాతీయ నాటకరంగాన్ని రెండింటినీ సమంగా అధ్యయం చేశా. పైగా నా హోదాలు చాలానే వున్నాయి. ఫిలింసొసైటీ మూవ్‌మెంట్‌ ఆద్యుల్లో ఒకర్ని. 1978లో పూనా ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఫిల్మ్‌ అప్రిసియేషన్‌ కోర్సును చేశా. సినిమా అధ్యయనం కేవలం ప్రవృత్తి మాత్రమే. అయితే నాటక అధ్యయాన్ని మాత్రం వృత్తిగా స్వీకరించి 25 ఏళ్ళుగా 'ప్రత్యామ్నాయ నాటకరంగం' పూర్తిస్థాయి కార్యకర్తగా పనిచేశా. నేషనల్‌ షో ఆఫ్‌ డ్రామా, ఢిల్లీ ఎడ్వయిజరీ బోర్డు మెంబర్‌గా కొంతకాలం పనిచేశా. నాటకరంగంలో శిక్షణ ఇచ్చాను. 1982, 83లో నాటకప్రయోక్త 'బాదల్‌ సర్కార్‌' దగ్గర కలకత్తాలో శిక్షణ తీసుకున్నా. బ్రెజీలియన్‌ నాటక ప్రయోక్త అగస్తోబోల్‌ వద్ద పారిస్‌లో శిక్షణ పొందాను. ఇవేకాకుండా భారతీయ, అంతర్జాతీయంగా భారత నాటకశిల్పవైరుద్యాల గురించి, సంస్కృతి గురించి అనేక తరగతులు కోర్సులు, వర్క్‌షాప్‌లు నిర్వహించా. 83 నుంచి 97 వరకు నార్వే, యు.కె. ఆస్ట్రేలియాతోపాలు పలు దేశాల్లో ఆయన వర్క్‌షాప్‌లు నిర్వహించా. అప్పుడప్పుడు 'మిసిమి' అనే పత్రికలో నాటకరంగం గురించి వ్యాసాలు రాస్తుంటాను. 
 
ప్రశ్న : సినిమా ఇండస్ట్రీలో మీరు తెలియదని చాలా మంది అంటున్నారు? 
నాదంతా పెద్దతరంవారే. దాసరినారాయణరావు, కోడిరామకృష్ణ, భరణి, అల్లు అరవింద్‌, వినాయక్‌.. ఇలాంటివారు బాగా తెలుసు. నా పుస్తకాన్ని వారు చదివి చాలా మెచ్చుకున్నారు. ఓ మిత్రుడైతే దీనికి అవార్డురాకపోతే.. ఇక నువ్వు కొనసాగించవద్దన్నాడు. ఇలా ఎందరో శ్రేయోభిలాషులు.. నాకు తోడ్పడ్డారు. 
 
ప్రశ్న : ఎన్ని కాపీలు అమ్ముడయ్యాయి? 
అదంతా పెద్ద కథ.. పబ్లిషర్‌.. కమర్షియల్‌గా ఆలోచించారు. ప్రథమ ముద్రణలోనే. ఎన్ని కాపీలు అనేవి వేయాలి.. కానీ ధర్మాన్ని మరిచి వారు వేయలేదు.. నేను అడిగినప్పుడల్లా.. వేయికాపీలు అమ్ముడయ్యాయి అంటారు. రెండు నెలల్లోనే వేయికాపీలు అమ్ముడయ్యాయి. లెక్కలు చూపించరు. అడిగితే ఏదో చెబుతారు.. అందుకే.. ఏదో ఒకటి చేయాలి... 
 
ప్రశ్న : మీరు పూర్వాశ్రమంలో కమ్యూనిస్టు అనివిన్నాం? 
ఈ కమ్యూనిస్టును కాదు.. కానీ.. ఎం.ఎల్‌. గ్రూప్‌లో వుండేవాడిని... అస్సలు ఇప్పుడే ఏ గ్రూపు సరిగ్గా లేదు. కమ్యూనిస్టులకు అస్సలు చరిత్రే తెలీదు. 
చంద్రపుల్లారెడ్డి వంటి వారు బాగా తెలుసు.. పుచ్చలపల్లి సుందరయ్య అంటే గౌరవం. 
 
ప్రశ్న : కమ్యూనిస్టులకు ఏమీ తెలియదంటే? 
సమాజంలో అన్ని వృత్తులు చేసేవారు వున్నారు. ఇది భూమి పుట్టినప్పుడు నుంచి వుంది. ఆ చరిత్రను కార్యకర్తలను చెప్పాలి. కానీ వారి దగ్గర అదిలేదు. ఏదో గతితార్కిక భౌతికవాదం అంటూ ఏదో చిన్నపాటి విషయాలు చెబుతారు. అస్సలు నా దృష్టిలో... భూమి, దాన్ని హక్కుదారు రైతు.. ఆయన దగ్గర అంటే. ఆయనకు సహకారాన్ని అందించేవారు.. ఇతర వృత్తులవారు. కమ్మరి, కుమ్మరి.. మంగలి, మాదిగ.. ఇలా 
ఎంతోమంది వృత్తిపని చేసి బతికేవారు. కాలక్రమంలో రైతు కాస్తా భూస్వామి, జమిందార్‌.. రాజుగా రూపాంతరాలు చెందారు.. అస్సలు అప్పటి సమాజంలో వేస్ట్‌ ఫెలో అంటే.. బ్రాహ్మణుడే.. కొందరికి కోపం రావచ్చు.. ఇది చరిత్ర.. తెలుసుకుని చెబుతున్నాను... అప్పట్లో... అడుక్కునేజాతి బ్రాహ్మణజాతి.. ఏ పని చేయకుండా.. ఇంటింటికి అడుక్కుని జీవనం సాగించారు. మిగతా వృత్తివారికి పండుగలప్పుడు, పంటలు 
పండినప్పుడు... బియ్యం, వస్తువులు ఆసామి ఇచ్చేవారు... అప్పట్లో ఎడ్యుకేషన్‌ లేదు.. కాలక్రమంలో.. ఎడ్యుకేషన్‌ అనేది మొదలయినప్పుడు బ్రాహ్మణులే ఖాళీగా వుండడంతో వారు అందులో చేరారు.. అలా వారు నేర్చుకున్న సంస్కృతంతో లోకంలో విషయాలు, దేవుడు, దెయ్యం అంటూ.. ప్రజల్ని మరో మార్గంవైపు తీసుకెళ్ళారు. ఇదంతా ఏదో కట్టుకథకాదు.. ఎన్నో పుస్తకాల్లో చదివింది, శోధించిన విషయాలు... అయితే.. 
రామాయణం, భారతాలంటారు. అవి ఆ తర్వాత బ్రాహ్మాణులే రాసింది. అంతకుమందు చరిత్ర నేను చెప్పేది.. ఇలాంటి నిజాలను చరిత్రలో పొందుపర్చాలి.
 
ప్రశ్న : అవార్డును ఎప్పుడు అందుకోనున్నారు? 
మే3వ తేదీన ఢిల్లీలో అందుకోనున్నా. ఇక్కడో విషయం చెప్పాలి.. మే 4న దాసరిగారి పుట్టినరోజు. ఆరోజు నాకు సన్మానం చేస్తానని చెప్పారు. కానీ నాకు సన్మానం అవీ పడవు.. పెద్దగా పాపులర్‌ కావాలని అనుకోను. ఇప్పటికి నా వయస్సు 65ఏళ్ళు.. ఈ వయస్సులో... అటూఇటూ తిరగలేను.. 
 
ప్రశ్న : మరి మిగతా రెండు భాగాలు ఎప్పుడువస్తున్నాయి? 
అవి వస్తాయా? రావా అనేది చెప్పలేను. ఇప్పటికే చాలా కాలం పట్టింది.. రాయాలని అనుకుంటున్నాను.. అని ముగించారు.