శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (14:39 IST)

పంచ పాడవుల్లా మా ప్యానల్‌లో ఐదుగురమే దిగాం: రాజేంద్రప్రసాద్

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో నటకిరీటి రాజేంద్రప్రసాద్ విజేతగా నిలిచారు. నువ్వా... నేనా... అన్న రీతిలో సాగిన ‘మా’ ఎన్నికల్లో 85 ఓట్ల తేడాతో జయసుధను ఓడించారు. రాజేంద్రప్రసాద్‌ గెలుపుతో ఆయన అభిమానులు, అనుచరులు సంబరాలు చేసుకున్నారు. ఇది సంచలన గెలుపు అని, న్యాయం గెలిసిందని నాగబాబు అన్నారు. ఇది జయసుధ ఓటమి కాదని మురళీమోహన్‌ ఓటమి అని విజయ్‌చందర్‌ వ్యాఖ్యానించారు. 
 
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ ఇది సేవా కార్యక్రమమని, ఇందులోనుంచి ఒక్క రూపాయి కూడా వృధాగా ఖర్చు చేయబోమని వెల్లడించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేర్చుతామని నటకిరీటి స్పష్టం చేశారు. పంచ పాండవుల్లా మా ప్యానల్‌లో ఐదుగురమే ఉన్నామని, మా ఎన్నికల్లో తుచ్చ రాజకీయాలు తీసుకువచ్చారని, మాకు మద్దతు ఇచ్చిన వారందరినీ బెదిరించారని, ప్రలోభపెట్టారని, వాటన్నిటిని తట్టుకుని... మీ మనసుల్లో నిలిచామని, మీ అందరికి సేవ చేయడానికే వచ్చామని ఆయన అన్నారు. 
 
నేను ఒంటరివాడని, వీడు అభిమన్యుడులా వేసేస్తామని అనుకున్నారని... కానీ వాళ్లకు తెలియని విషయం ఒకటుంది. ఏమిటంటే నేను నటకిరీటిని అంటే అర్జునుడిని... ఆ విషయం ఇప్పుడు తెలుసుకుని ఉంటారు అని రాజేంద్రప్రసాద్‌ అన్నారు. ఈ సమయంలో నన్ను వెన్ను తట్టి, నా వెనుక ఉండి... నన్ను నడిపించిన ఒకే ఒక వ్యక్తి నాగబాబు అని ఆయన అన్నారు. ఏదీ ఏమైనా నేను ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చుతానని ఆయన మరోసారి హామీ ఇచ్చారు. మీ అందరికి సేవచేసే అవకాశం ‘మా’ మెంబర్లు నాకు కల్పించారని, నా విజయాన్ని కోరుకున్న ప్రతి ఒక్కరికి రాజేంద్రప్రసాద్‌ కృతజ్ఞతలు తెలిపారు.