శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : బుధవారం, 19 నవంబరు 2014 (20:45 IST)

తెలంగాణ ప్రజలు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజిస్తారు? - రాంగోపాల్ వర్మ

సంచలనాలకు మారుపేరైన సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో సరికొత్త వివాదానికి తెరలేపాడు. ఈ సారి ఏకంగా దేవుడినే టార్గెట్ చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. వార్తలకెక్కాడు. తెలంగాణ ప్రజలకు తమ సొంత దేవుడు యాదగిరి నరసింహస్వామి ఉండగా... ఆంధ్రోళ్ళ దేవుడైన తిరుపతి వేంకటేశ్వరస్వామిని ఎలా దర్శనం చేసుకుంటారన్నారు. శ్రీవారికి పూజలు చేయడం న్యాయమేనా అని ప్రశ్నించారు. 
 
తెలంగాణ ప్రజలు తిరుపతి వెంకన్నను మొక్కితే... యాదగిరి నరసింహుడిని అవమానించినట్టు తాను భావిస్తానని ట్వీట్ చేశాడు. సొంత దేశాన్ని ప్రేమించినట్లే సొంత దేవుళ్లను పూజించాలి తప్ప పొరుగు రాష్ట్రాల దేవుళ్లను కాదని చెప్పాడు. తెలంగాణ ప్రజలు వేంకటేశ్వరస్వామి కంటే యాదగిరి నరసింహస్వామిని తక్కువగా దర్శించుకుంటారని తాను అనడం తప్పుకాదు కదా అని కూడా వర్మ ప్రశ్నించాడు. 
 
యాదగిరి గుట్టను అభివృద్ధి చేస్తానని కేసీఆర్ అనడం తనకెంతో సంతోషం కలిగించిందని... దీంతో, తెలంగాణ ప్రజలు తమ సొంత దేవుడి విలువను గ్రహిస్తారని మరో సెటైర్ కూడా వేశాడు. ఈ వ్యాఖ్యలపై ఎలాంటి దుమారం చెలరేగుతుందో వేసిచూద్ధాం.