ఫ్యాంటు మడిచి.. చీపురు చేతబట్టి.. స్వచ్ఛ భారత్లో సల్మాన్ ఖాన్!
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన స్వచ్ఛ భారత్ పిలుపునకు పలువురు బాలీవుడ్ స్టార్లు స్పందిస్తున్నారు. ఇందులోభాగంగా. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా 'స్వచ్ఛ భారత్ అభియాన్' కార్యక్రమంలో పాల్గొన్నాడు. మోడీ ఇచ్చిన సవాల్ మేరకు ఆయన చీపురు పట్టాడు.
మంగళవారం ముంబైలోని కర్జాత్ ప్రాంతంలో సన్నిహితులతో కలిసి పరిసరాలను శుభ్రం చేశాడు. ప్యాంటు పైకి మడిచి, చీపురు పట్టిన సల్మాన్ చెత్తను తొలగించడమే కాకుండా, అక్కడి గోడలకు సున్నం కూడా వేశాడు. తాను చేసిన పనులను ఫోటోలు తీసి ఫేస్బుక్లో ఉంచాడు.
అంతేకాకుండా, ఈ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, 'మిస్టర్ ఫర్ఫెక్షనిస్టు' అమీర్ ఖాన్, విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ, ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ, సీఈవో చందా కొచ్చర్, కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, వీడియోకాన్ గ్రూపు అధిపతి ప్రదీప్ దూత్ తదితరులను సల్మాన్ ఖాన్ నామినేట్ చేశాడు.