శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: శనివారం, 27 జూన్ 2015 (19:30 IST)

'పులి' చిత్రంలో రాణీ సౌమ్యాదేవి క్యారెక్టర్‌ కోసం ఒరిజినల్‌ బంగారు ఆభరణాలు

'కత్తి' చిత్రంతో తమిళనాడులో బాక్సాఫీస్‌ రికార్డుల్ని సృష్టించిన ఇలయదళపతి విజయ్‌ లేటెస్ట్‌గా శింబుదేవన్‌ దర్శకత్వంలో ఎస్‌.కె.టి. స్టూడియోస్‌ పతాకంపై పి.టి.సెల్వకుమార్‌ నిర్మిస్తున్న 'పులి' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ జూన్‌ 22న విజయ్‌ బర్త్‌డే సంద్భంగా రిలీజ్‌ అయింది. ఈ టీజర్‌కు యూట్యూబ్‌లో ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. రికార్డు స్థాయిలో హిట్స్‌ సాధించింది. ఈ చిత్రంలో ఆలిండియా స్టార్‌ శ్రీదేవి రాణీ సౌమ్యాదేవిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్యారెక్టర్‌ కోసం ఒరిజినల్‌ బంగారు ఆభరణాలను ఉపయోగించడం జరిగింది. 
 
ఈ చిత్రం గురించి నిర్మాతలు చిబు తమీన్స్‌, పి.టి.సెల్వకుమార్‌ మాట్లాడుతూ ''తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీదేవి రాణీ సౌమ్యాదేవి క్యారెక్టర్‌లో చాలా అద్భుతంగా నటించారు. టీజర్‌లో శ్రీదేవి లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తుంది. ఈ పాత్ర కోసం శ్రీదేవి ఉపయోగించిన కిరీటం, అభరణాలన్నీ ఒరిజినల్‌ బంగారంతోనే చేయబడ్డాయి. ఈ లుక్‌ కోసం శ్రీదేవిగారు ప్రతిరోజు నాలుగైదు గంటలు మేకప్‌ కోసమే కేటాయించారు. తొమ్మిది గంటలకే షూటింగ్‌ అంటే ఉదయం నాలుగు గంటలకే సెట్‌లో ఉండేవారు. 
 
ఈ మేకప్‌ బరువు దాదాపు పది నుండి పదిహేను కిలోలు ఉన్నప్పటికీ ఆమె సినిమా కోసం చాలా డేడికేషన్‌తో వర్క్‌ చేశారు. ఈ సినిమా కోసం కత్తియుద్ధం వంటి యాక్షన్‌ సన్నివేశాల్లో కూడా ఆమె నటించారు. ఆమె రోల్‌ సినిమాలో కీలకమవుతుందనడంలో సందేహం లేదు. ఈ చిత్రంపై ఇండస్ట్రీ వర్గాల్లో, అభిమానుల్లో హై ఎక్స్‌పెక్టేషన్స్‌ నెలకొని ఉన్నాయి. ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ను జనవరిలో స్టార్ట్‌ చేశాం. గ్రాఫిక్స్‌కి అవసరమైన సన్నివేశాలను అప్పుడే పూర్తి చేసేశాం. 
 
నైన్‌ స్టూడియో వారికి ఈ గ్రాఫిక్స్‌ తుదిమెరుగులు దిద్దడానికి ఫిభ్రవరిలోనే ఆ షాట్స్‌ను పంపేశాం. డెన్మార్క్‌, రష్యా, ఐర్లాండ్‌, ఉక్రెయిన్‌, అర్మేనియా దేశాలకు చెందిన టెక్నిషియన్స్‌ ఈ సినిమా గ్రాఫిక్‌ వర్క్‌పై పనిచేస్తున్నారు. మా చిత్రీకరణ మే నెలలోనే పూర్తి చేసేశాం. అయితే ఈ సినిమా ఇంకా విజువల్ ఎఫెక్ట్స్ పనులను జరుపుకుంటుంది. ఇంకా ఆ పనులు పూర్తికాలేదు. జూలై నెలలో అవి పూర్తయ్యే అవకాశాలు ఉండటంతో ఈ సినిమాని ఆగస్టు నెలాఖరున విడుదల చేయాలనుకుంటున్నాం. మా పులి చిత్రం విజయ్‌ కెరీర్‌లోనే మరో బిగ్గెస్ట్‌ బ్లాక్‌‌బస్టర్‌ హిట్‌ మూవీగా నిలుస్తుంది'' అన్నారు. 
 
విజయ్‌, శృతి హాసన్‌, హన్సిక, ఆలిండియా స్టార్‌ శ్రీదేవి, కన్నడ స్టార్‌ సుదీప్‌, ప్రభు, తంబి రామయ్య, సత్యన్‌, జూనియర్‌ బాలయ్య, నరేన్‌, జో మల్లూరి, మధుమిత, అంజలీదేవి, గాయత్రితో పాటు 40 మంది ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ త్రిభాషా చిత్రాన్ని ఎస్‌.కె.టి. స్టూడియోస్‌ బేనర్‌పై శింబు దేవన్‌ దర్శకత్వంలో శిబు తమీన్స్‌, పి.టి.సెల్వకుమార్‌ నిర్మిస్తున్నారు.