1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 జూన్ 2020 (15:15 IST)

లాక్డౌన్ తర్వాత విదేశాల్లో విడుదలైన తొలి బాలీవుడ్ సినిమా ఏది?

ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు అనేక మంది పిట్టల్లా రాలిపోతున్నారు. వేలాది మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. దీంతో ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు వీలుగా ప్రపంచ దేశాలన్నీ తమ వీలునుబట్టి లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. అలాంటి దేశాల్లో న్యూజిలాండ్ ఒకటి. 
 
అయితే, ప్రస్తుతం ఇక్కడ కొత్తగా నమోదయ్యే కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో సినిమా థియేటర్స్‌ను కూడా తెరిచేందుకు ఆ దేశ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఫలితంగా 25వ తేదీ నుంచి థియేటర్స్ తెరుచుకున్నాయి. దీంతో రిలీజ్ కావ‌ల‌సిన సినిమాల‌తో పాటు గ‌తంలో విడుద‌లైన సినిమాల‌ని కూడా రిలీజ్ చేస్తున్నారు. ద‌ర్శ‌కుడు రోహిత్ శెట్టి రూపొందించిన 'గోల్ మాల్ ఎగైన్‌'ని న్యూజిలాండ్‌లో రీరిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాడు.
 
బాలీవుడ్‌లో గోల్‌మాల్ సిరీస్‌తో వ‌చ్చిన‌ 'గోల్‌మాల్ ఎగైన్' చిత్రాన్ని రోహిత్ శెట్టి డైరెక్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఓ ఇంట్లో ఫ్రెండ్స్ గ్యాంగ్ దెయ్యాల నుంచి ఎలాంటి అనుభవం పొందారన్నదే ఈ చిత్ర కథాంశం. ఈ చిత్రంలో అజయ్ దేవగణ్, పరిణితీ చోప్రా, తుషార్ కపూర్, టబు, కునాల్ కేము, శ్రేయాస్ టాల్పేడ్ ప్రధాన పాత్రలలో న‌టించారు. 
 
2017లో విడుద‌లైన ఈ చిత్రం నేటి నుంచి న్యూజిలాండ్ థియేట‌ర్‌లో అందుబాటులో ఉండ‌నుంది. లాక్డౌన్ త‌ర్వాత విడుద‌లైన తొలి హిందీ చిత్రం ఇదే కావ‌డం విశేషం. ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం అందిస్తుంద‌ని ద‌ర్శ‌కుడు పేర్కొన్నారు.