బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 జులై 2020 (14:23 IST)

రాజుకు తక్కువ.. రాణికి ఎక్కువ? దీపికకు అంత అవసరమా?

టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె నటిచనుంది. ప్రభాస్ 21వ చిత్రంలో వీరిద్దరూ కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మించనున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తారు. 
 
అయితే, ఈ చిత్రంలో హీరోయిన్‌గా దీపికా పదుకొనెను ఎంపిక చేశారు. దీంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఆశ్చర్యపోయింది. ఆమె నటిస్తోన్న విషయాన్ని తాజాగా అధికారికంగా చిత్రయూనిట్ ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా ఈ ప్రాజెక్ట్ రూపురేఖలు మారిపోయాయి. ఇంకా చెప్పాలంటే ఈ చిత్రానికి 'బాహుబలి' రేంజ్ వచ్చేసింది.
 
దర్శకుడు నాగ్ అశ్విన్ ‘మహానటి’ చిత్రంతో తనెంటో నిరూపించుకున్నాడు. ఆ చిత్రం తర్వాత చాలా టైమ్ తీసుకున్న నాగ్ అశ్విన్.. ప్రభాస్ రేంజ్‌కి సరిపోయే కథని సిద్ధం చేయడంతో పాటు, సొంత బ్యానర్ వైజయంతీ మూవీస్‌లోనే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నారు. 
 
అయితే ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించడానికి దీపికా పదుకొనే రూ.30 కోట్లు డిమాండ్ చేసినట్లుగానూ, అందుకు చిత్రయూనిట్ అంగీకరించినట్లుగా ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. 
 
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి హీరోయిన్‌కే రూ.30 కోట్లు ఇస్తే.. ఇక హీరో, ఇతర నటీనటులకు ఇంకెంత ఇవ్వనున్నారు. అలాగే ఈ రేంజ్ సినిమాకి సాంకేతిక విభాగానికి కూడా భారీగానే ఖర్చు అవుతుంది. వాటికెంత ఖర్చు చేయనున్నారు. 
 
అయినా టాలీవుడ్‌లో ఏ స్టార్ హీరోకి లేని రెమ్యూనరేషన్ ఈ సినిమా విషయంలో హీరోయిన్‌కి ఇస్తుండటంతో.. అంత అవసరమా..? అంటూ ప్రభాస్ అభిమానులే సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.