దక్షిణాదిలో పరదేశీ భామల ప్రభావం... వాళ్లనే కావాలంటున్నారా...?
సౌత్ ఇండస్ట్రీలో విదేశీ హవా కొనసాగుతోంది. హీరోయిన్లుగా ముంబై భామలే ఎక్కువగా వచ్చేవారు. కానీ అది విదేశాలకు పాకింది. గతంలో విశ్వనాథ్ దర్శకత్వంలో అమెరికా అమ్మాయిలో విదేశీ భామ నటించింది. ఆ తర్వాత స్వర్ణకమలంలో కూడా వచ్చేసింది. అయితే ఇటీవలే యూత్ దర్శకులు అమెరికా నేపథ్యం కథ ఎంపికలో అక్కడివారినే ఎంపిక చేస్తున్నారు. ఇటీవలే భూ అనే చిత్రం కోసం అక్కడికి చెందిన మధు అనే భామను కొత్తగా పరిచయం చేశారు. ఆ తర్వాత అలాంటి హవా కొనసాగుతోంది.
ఇప్పుడు బ్రిటీష్ మోడల్ నటి ఎమీ జాక్సన్ ఇండియాలో పేరు తెచ్చుకుంది. ఒక్క ఐ సినిమాతో అందరినీ ఆకర్షించింది. ఇంతకుముందు ఐటం సాంగ్ గర్ల్స్గా విదేశీ భామల్ని పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరోల చిత్రాల్లో తీసుకునేవారు. కానీ హీరోయిన్ స్థాయికి చేరింది ఎమీ జాక్సన్. ఎమీ జాక్సన్ ఇంతకుముందు మదరాసి పట్నం ద్వారా తెలుగువారికి పరిచయమై ఆ తర్వాత రామ్ చరణ్ ఎవడు చిత్రంలో నటించింది.
'ఐ' చిత్రంతో ఆమె హాట్ టాపిక్గా మారింది. బాలీవుడ్లో సల్మాన్ఖాన్, సైఫ్ అలీఖాన్లతో విదేశీ భామలు నటించడం పరిపాటే కానీ దక్షిణాదిలో వీరి హవా ఇంకా పెరిగే సూచనలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే హీరోయిన్ల కొరత వచ్చేసింది. ఇలియానా, నయనతార, శ్రియ వంటివారు దర్శక నిర్మాతలకు పాతవారు అయిపోయారు. కొత్తదనం ప్రేక్షకులు కోరుతున్నారంటూ.... విదేశీయులను తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల విదేశీ కల్చర్ సినిమాల్లో బాగా పెరిగిపోయే అవకాశముందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.