చిరంజీవి బాటలో విజయశాంతి.. "ఒసేయ్.. రాములమ్మ"గా రీ ఎంట్రీ!?
సొంతగా రాజకీయ పార్టీ స్థాపించి.. ఆ తర్వాత కాంగ్రెస్ సముద్రంలో కలిసిపోయి.. కేంద్ర మంత్రిగా విధులు నిర్వహించి.. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే టాలీవుడ్లో రీ ఎంట్రీ ఖాయమై పోయింది. అదే బాటలో మెదక్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి కూడా నడవాలని నిర్ణయించుకున్నారు. ఈమె గతంలో నటించిన "ఒసేయ్ రాములమ్మ" చిత్రం సీక్వెల్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
రాజకీయాల్లో ఆశించిన ఫలితం దక్కకపోవడంతో చిరంజీవి సినిమాల్లోకి పునరాగమనం చేయాలని నిశ్చయించుకోవడం తెలిసిందే. ఇప్పటికే చిరంజీవి 150వ సినిమా విషయం తెలుగు సినీ వర్గాలతో పాటు ప్రజల్లో కూడా హాట్ టాపిక్గా మారింది. తాజాగా, చిరంజీవి బాటలోనే లేడీ అమితాబ్ విజయశాంతి కూడా మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై రీఎంట్రీ ఇవ్వాలనుకుంటోంది.
విజయశాంతి రాజకీయ ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిస్తే... ఆమె బీజేపీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ తర్వాత బీజేపీ నుంచి బయటకు వచ్చి సొంతంగా తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. అయితే, కొన్నేళ్లకే ఆ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేశారు. ఆ తర్వాత కేసీఆర్తో ఏర్పడిన విభేదాల కారణంగా టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ లో చేరారు. రాజకీయ భవిష్యత్తు ఏమాత్రం ఆశాజనకంగా కనిపించకపోవడంతో... 'రాములమ్మ' మళ్లీ ముఖానికి రంగేసుకోవాలని నిశ్చయించుకుందట!
దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన "ఓసేయ్ రాములమ్మ" 1997లో విడుదలై అప్పటివరకు ఉన్న టాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేసిన విషయం తెల్సిందే. ఈ సినిమాలో నటనకు గాను నంది అవార్డుతో పాటు ఫిలింఫేర్ అవార్డును కూడా విజయశాంతి గెలుచుకుంది. తనకు నటిగా అపరితమైన గుర్తింపు తెచ్చిపెట్టిన ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలని విజయశాంతి భావిస్తున్నట్లు సమాచారం. ఈ సీక్వెల్ ను స్వీయదర్శకత్వంలో నిర్మించాలని విజయశాంతి యోచిస్తున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు.