శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 25 జులై 2017 (07:01 IST)

మత్తు దందాలో ఇరికిస్తారని భయమేస్తోంది... బోరున విలపిస్తున్న చార్మీ

హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ స్కామ్‌లో తనను ఇరికిస్తారనే భయం పట్టుకుందని సినీ నటి చార్మీ వాపోతోంది. ఇదే జరిగితే తన కెరీర్‌తోపాటు భవిష్యత్ కూడా నాశనమవుతుందని ఆమె తన స్నేహితుల వద్ద బోరున విలపిస్తోం

హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ స్కామ్‌లో తనను ఇరికిస్తారనే భయం పట్టుకుందని సినీ నటి చార్మీ వాపోతోంది. ఇదే జరిగితే తన కెరీర్‌తోపాటు భవిష్యత్ కూడా నాశనమవుతుందని ఆమె తన స్నేహితుల వద్ద బోరున విలపిస్తోందట. ప్రముఖ హీరోయిన్‌ కాజల్‌‌ అగర్వాల్‌తోపాటు పలువురు హీరోయిన్లకు మేనేజర్‌గా వ్యవహరిస్తున్న పుట్కర్‌ రాన్‌సన్‌ జోసెఫ్‌ (38) డ్రగ్స్‌ కేసులో హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పలువురు హీరోయిన్లతో పాటు సినీ ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ నేపథ్యంలో చార్మీ సోమవారం ఉమ్మడి హైదరాబాద్ హైకోర్టును ఆశ్రయించిన విషయంతెల్సిందే. కోర్టులో సమర్పించిన పిటీషన్‌లో తన గోడును వెళ్లబోసుకున్నారు.
 
'నేను ముంబైలో జన్మించాను. 15 ఏళ్ల వయసులో ‘నీతోడు కావాలి’ అనే తెలుగు చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశాను. రెండు నంది అవార్డులు అందుకున్నాను. సినీ పరిశ్రమలో నాకు వస్తున్న గుర్తింపును ఒక వర్గం జీర్ణించుకోలేకపోతోంది. నాపై లేనిపోని ఆరోపణలు చేస్తూ నా ప్రతిష్టకు భంగం కలిగించేలా దుష్ప్రచారం చేస్తోంది. కొన్ని మీడియా సంస్థలు సర్క్యులేషన్‌ పెంచుకోవడానికి, చానళ్లు టీఆర్‌పీ రేటింగ్‌ కోసం లేనిపోనివి అంటగట్టి ప్రచారం చేస్తున్నాయి. నేను మహిళను. తల్లిదండ్రులు నాతో లేరు. నాకు సహకరించే స్నేహితులు హైదరాబాద్‌లో లేరు.
 
రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 22(1) కింద న్యాయవాది ద్వారా సహాయం పొందే హక్కు నాకు ఉంది. కుట్రపూరితంగా కేసులో ఇరికించే ప్రశ్నలు వేసి, ఒత్తిడి చేసి చేయని నేరాన్ని అంగీకరింపచేస్తారని భయపడుతున్నాను. నాకు ఇంకా పెళ్లి కాలేదు. లేని పోని అభాండాలు వేసి ప్రచారం చేస్తే తీరని నష్టం జరుగుతుంది. భవిష్యత్, కెరీర్‌ నాశనమవుతుంది. విచారణ సమయంలో నన్ను భయపెట్టకుండా, ఒత్తిడి చేయకుండా ఉండేందుకు న్యాయవాదిని అనుమతించాలి. మహిళా అధికారులతోనే విచారణ చేయాలి' అని ఆమె కోరారు. ఎక్సైజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌, డైరెక్టర్‌, సూపరింటెండెండ్‌ (సిట్‌)లను ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.