1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Modified: బుధవారం, 26 డిశెంబరు 2018 (18:12 IST)

తిత్లీ తుఫాను ఎఫెక్ట్... సురక్షిత మంచి నీటికోసం అల్లు అర్జున్ ముందడుగు

అక్టోబర్ రెండో వారంలో వచ్చిన తిత్లీ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాను అతలా కుతలం చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 25 మండలాల్లో వెయ్యికి పైగా గ్రామాలు తిత్లీ తుఫాను బారిన పడ్డాయి. దీంతో పంట పొలాలు, గృహాలు శిథిలావస్థకు చేరి నిలవ నీడ లేకుండా చేశాయి. ముఖ్యంగా తాగునీరు కలుషితమై ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 
 
ఆ సమయంలోనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తిత్లీ ప్రభావిత ప్రాంతాల్ని పర్యటించి వారికి కావాల్సిన కనీస సౌకర్యాల గురించి ఆరా తీశారు. అంతేకాదు వారిని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని ప్రతీ ఒక్కర్ని అభ్యర్థించారు. ఆ పిలుపు అందుకొని సౌతర్న్ స్టార్ అల్లు అర్జున్ వెంటనే స్పందించారు. మండస, వజ్రకొట్టూరు మండలాల్లోని.. కొండలోగం, దేవునలతడ, అమలపాడు, పొల్లాడి గ్రామాలకు సురక్షిత మంచినీరు అందించేందుకు గాను 3 ఆర్వో (రివర్స్ ఆస్మాసిస్) వాటర్ ప్లాంట్స్, ఒక బోర్‌వెల్ వేయించేందుకు ముందుకు వచ్చారు. 
 
మరో 15 రోజుల్లో ఈ వాటర్ ప్లాంట్స్, బోర్ వెల్ అందుబాటులోకి రానున్నాయి. ఆయా గ్రామాల్లోని దాదాపు 3000 మందికి సురక్షిత మంచి నీరు వీటి ద్వారా అందనుంది. ఆ ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పటికే కిడ్నీ సంబధిత వ్యాధులతో బాధపడుతున్నారు. అందుకే నీటి పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఈ వాటర్ ప్లాంట్స్, బోర్ వెల్ ఏర్పాటు చేయనున్నారు. అల్లు అర్జున్ ముందుకొచ్చి సురక్షిత మంచి నీరు అందిస్తున్నందుకు ఆ గ్రామ ప్రజలు సంతోషంతో ధన్యవాదాలు తెలియజేశారు.