ఆవేశంతో ఊగిపోయిన శివగామి... 'బాహుబలి' డైలాగ్ ట్రైలర్ అదుర్స్...
రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన భారీ బడ్జెట్ మూవీ 'బాహుబలి' గురించి రోజుకొక వార్త వెల్లడవుతూనే ఉంది. ఈ చిత్రంపై అభిమానుల ఆసక్తిని పెంచే రీతిలో చిత్ర విశేషాలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ ఉన్నారు. ఇప్పటికే విడుదలైన రానా, అనుష్కల మధ్య డైలాగ్ల ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
తాజాగా 'బాహుబలి' చిత్రంలో మరో ప్రత్యేక పాత్రలో నటించిన నటి రమ్యకృష్ణ డైలాగ్ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ ట్రైలర్లో మహిష్మతి సైన్యం తిరుగుబాటుదారులపై విరుచుకుపడటం, వాళ్లను చిత్రహింసలకు గురిచేయడం వంటి దృశ్యాలను చూపుతున్నారు. వాటితోపాటు శివగామి పాత్రలో నటించిన రమ్యకృష్ణ ''వీళ్ల తిరుగుబాటుతో మహిష్మతికి మకిలి పట్టింది. రక్తంతో కడిగెయ్" అంటూ ఆవేశంతో ఊగిపోవడం అందరినీ అమితంగా ఆకట్టుకుంటుంది. కాగా 'బాహుబలి' చిత్రం జూలై పదో తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే.