1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 జులై 2020 (15:37 IST)

ఐశ్వర్యా రాయ్ - ఆరాధ్యకు కరోనా పాజిటివ్... జయా బచ్చన్ రిపోర్టు ఏంటి?

బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌ ఫ్యామిలీ కరోనా వైరస్ బారినపడ్డారు. అమితాబ్ భార్య జయాబచ్చన్ మినహా మిగిలిన వారందరికీ ఈ వైరస్ సోకింది. అమితాబ్, ఆయన కుమారుడు అభిషేక్‌లకు కరోనా సోకినట్టు శనివారం తేలింది.
 
ఆ తర్వాత అమితాబ్ కోడలు ఐశ్వర్యా రాయ్, మనుమరాలు ఆరాధ్య, భార్య జయాబచ్చన్‌లకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఐశ్వర్యా, ఆరాధ్యలకు కరోనా పాజిటివ్ అని తేలినట్టు సమాచారం. 
 
ఈ ఉదయం ఐశ్వర్య, ఆరాధ్యలకు తెమడ పరీక్ష చేయగా నెగెటివ్ వచ్చిందని ముంబయి నగర మేయర్ కిశోరి పెడ్నేకర్ తెలిపారు. అయితే, రెండో టెస్టులో వారిద్దరికీ పాజిటివ్ వచ్చిందని బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) కమిషనర్ వెల్లడించారు.
 
ఇక, అమితాబ్ అర్ధాంగి జయా బచ్చన్‌కు యాంటీజెన్ టెస్టులో నెగెటివ్ వచ్చినట్టు తెలిసింది. అమితాబ్ కుటుంబంలో పలువురికి కరోనా సోకడంతో వారి నివాస భవనం 'జల్సా'ను బీఎంసీ అధికారులు మూతవేసి శానిటైజ్ చేశారు. కాగా, అమితాబ్, అభిషేక్ ముంబైలోని నానావతి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే.