శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 13 జూన్ 2017 (14:28 IST)

డీసీఎంఎస్ బండారం బయటపడింది.. రైతుల సొమ్ముతో గోపాల గోపాల, సికిందర్ సినిమాల పంపిణీ..

రైతుల సొమ్ముతో సినిమాలు చేసిన సహకార మార్కెటింగ్ సొసైటీ బాగోతం బయటపడింది. రైతుల కోసం పనిచేయాల్సిన ఒంగోలు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) పాలకవర్గం నిజానికి తాము నిర్వర్తించాల్సిన బాధ్యతలను

రైతుల సొమ్ముతో సినిమాలు చేసిన సహకార మార్కెటింగ్ సొసైటీ బాగోతం బయటపడింది. రైతుల కోసం పనిచేయాల్సిన ఒంగోలు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) పాలకవర్గం నిజానికి తాము నిర్వర్తించాల్సిన బాధ్యతలను పక్కనబెట్టి రీల్ మోజులో పడింది. నిబంధనలకు విరుద్ధంగా సినిమా వ్యాపారం చేసింది. సూర్య నటించిన సికిందర్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ నటించిన గోపాల గోపాల వంటి సినిమాలను పంపిణీ చేసి  రూ.70 లక్షల మేర నష్టపోయింది. 
 
ఈ వ్యవహారం ఆడిట్ సమయంలో తేలినా.. సహకార శాఖ ఆడిటర్లు సీరియస్‌గా తీసుకోకుండా అక్రమాలకు అండగా నిలిచారు. అంతటితో ఆగకుండా నష్టపోయిన మొత్తంలో కొంత తిరిగిరాని బాకీ కింద లెక్క చూపారు. ఆడిట్ నివేదికను కూడా అధికారులు పట్టించుకోలేదు. 
 
ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో దీనిపై స్పందించిన సహకార శాఖ కమిషనర్‌ మురళి పరిశీలన చేయడంతో అసలు బాగోతం వెలుగులోకి వచ్చింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న మురళి ఏడుగురు అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌లపై సస్పెన్షన్‌ వేటు వేశారు. జిల్లా సహకార శాఖాధికారికి షోకాజ్‌ నోటీసు జారీ చేయడంతో ఒక్కసారిగా ఆ శాఖలో కలకలం రేగింది. 
 
ప్రస్తుత ఛైర్మన్ బీరం వెంకటేశ్వర రెడ్డి నేతృత్వంలోని పాలకమండలి ఎరువులు, విత్తనాలు వంటి సామగ్రిని రైతులకు అందించాల్సిందిపోయి.. సినిమాల పంపిణీపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా 2014-15, అలాగే 2015-16 ఆర్థిక సంవత్సరాల్లో సికిందర్‌, గోపాల గోపాల అనే సినిమాల డిస్ట్రిబ్యూషన్‌ వ్యాపారాన్ని నిర్వహించింది. ఈ వ్యాపారంలో రూ.70లక్షల మేర నష్టపోయింది. ఇలా చేయడం సహకార చట్టం, సంస్థ నిబంధనలకు పూర్తి విరుద్ధమని తెలిసినా.. రైతులకు సహకరించాల్సిన సహకార పాలకమండలి ఇలా సినిమా వాళ్లకు సహకరించడంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి.