శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 21 జులై 2017 (10:13 IST)

'డ్రగ్స్' విచారణకు నటుడు సుబ్బరాజు.. సిట్ ఆఫీసర్లు సినిమా చూపిస్తారా?

హైదరాబాద్ డ్రగ్స్ స్కామ్‌ విచారణలో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారుల ఎదుట టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు శుక్రవారం ఉదయం హాజరయ్యాడు. ఆయన వద్ద సిట్ అధికారుల బృందం మత్తు దందాపై పూ

హైదరాబాద్ డ్రగ్స్ స్కామ్‌ విచారణలో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారుల ఎదుట టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు శుక్రవారం ఉదయం హాజరయ్యాడు. ఆయన వద్ద సిట్ అధికారుల బృందం మత్తు దందాపై పూర్తి స్థాయిలో విచారణ జరుపనుంది. కాగా, ఈ కేసులో ఇప్పటికే సినీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, కెమెరామెన్ శ్యామ్ కె నాయుడుని సిట్ అధికారులు ప్రశ్నించిన విషయం తెల్సిందే. 
 
ఇదిలావుండగా, తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన మరో పది మందికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే 12 మందికి నోటీసులిచ్చి విచారణ జరుపుతున్న సిట్ బృందం పూరీ జగన్నాథ్ నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా తాజాగా నోటీసుల జారీకి సిద్ధమయ్యారట. 
 
అలాగే, డ్రగ్స్ సరఫరాలో కెల్విన్ ముఠాలోని ఒక వ్యక్తి కోసం సిట్ బృందం గాలింపును తీవ్రం చేసింది. అధికారుల కదలికలను ఎప్పటికప్పుడు గ్రహించిన సదరు వ్యక్తి ఎప్పటికప్పుడు తన స్థావరాలను మారుస్తున్నట్లు సమాచారం. ఇతడిని అరెస్టు చేస్తే ఎల్‌ఎస్‌డి, ఎండిఎంఎ డ్రగ్స్ మరిన్ని పట్టుబడే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. 
 
అదేసమయంలో విదేశాల నుంచి డ్రగ్స్ దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నారన్న సమాచారంతో సిట్ అధికారులు డిహెచ్‌ఎల్, బ్లూడాట్, ఫెడెక్స్, ఇండియా పోస్టు సంస్థలకు చెందిన ప్రతినిధులను పిలిచి మాట్లాడారు. విదేశాల నుంచి వచ్చే పార్సిళ్ళపై నిఘా పెట్టాలని, అనుమానం ఉంటే తమకు సమాచారం అందించాలని సూచించారు.