గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 జులై 2020 (19:17 IST)

జీవితంలో ఫస్ట్‌టైమ్ చావు భయమేంటో తెలిసింది : బండ్ల గణేష్

తన జీవితంలో తొలిసారి చావు భయం ఎలా ఉంటుందో స్వయంగా అనుభవించానని ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ కారణంగా ఈ అనుభవం తనకు ఎదురైందని చెప్పారు. 
 
కరోనా వైరస్ బారినపడిన బండ్ల గణేష్... హైదరాబాద్ నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో 14 రోజుల పాటు చికిత్స తీసుకున్న తర్వాత ఈ వైరస్ బారిననుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన తన ఇంట్లో ఉంటున్నారు. 
 
ఈ క్రమంలో ఆయన తాజాగా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. తాను ఇతర వ్యాపార పనుల నిమిత్తం ఎక్కువగా షాద్ నగర్ వెళుతుంటానని, అక్కడేమైనా కరోనా సోకి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. 
 
ఓ ఫ్రెండ్ కుమారుడికి రోడ్డు ప్రమాదం జరిగితే ఆసుపత్రికి వెళ్లానని, అక్కడున్నప్పుడే ఫోన్‌కు కరోనా రిపోర్టు సందేశం రూపంలో వచ్చిందన్నారు. దాంట్లో పాజిటివ్ అని ఉండడంతో మొదటిసారి భయం అంటే ఏంటో తెలిసొచ్చిందని, టెన్షన్‌కు గురయ్యానని తెలిపారు.
 
అయితే ఆసుపత్రిలో చికిత్స పొంది త్వరగానే కోలుకున్నానని, తనకు సీనియర్ హీరో మోహన్ బాబు, దర్శకుడు మారుతి, హీరో శ్రీకాంత్, రాజా రవీంద్ర, వీవీ వినాయక్, శ్రీను వైట్ల ఫోన్ చేసి పరామర్శించారని వెల్లడించారు. 
 
మెగాస్టార్ చిరంజీవి గారు ఫోన్ చేసి పది నిమిషాలు మాట్లాడారని, ఎన్నో జాగ్రత్తలు చెప్పారని తెలిపారు. ఈ సందర్భంగా యాంకర్ మాట్లాడుతూ, మీ దేవుడు పవన్ కల్యాణ్ ఫోన్ చేయలేదా? అని ప్రశ్నించింది.
 
అందుకు బండ్ల గణేశ్ బదులిస్తూ, పవన్ ఫోన్ చేయలేదని తెలిపారు. బహుశా, తనకు కరోనా సోకిన విషయం ఆయనకు తెలిసుండకపోవచ్చన్నారు. నాకు కరోనా సోకిన విషయం ఆయనకు తెలియదేమోలే అని సరిపెట్టుకోవడమే మంచిదని అన్నారు. 
 
అయితే ఎంతోమంది ఫోన్ చేసినా దర్శకుడు మారుతి ఫోన్ చేసినప్పుడు ఎంతో సంతోషానికి గురయ్యానని, ఆయనతో తాను ఎలాంటి చిత్రం చేయకపోయినా ఫోన్ చేసి పరామర్శించడం మనసును హత్తుకుందని వెల్లడించారు. 
 
ఇకపోతే, ప్రిన్స్ మహేష్ బాబు నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఓ చిన్నపాత్ర పోషించానని, ఇలాంటి పాత్రల్లో ఎందుకు చేస్తారని తన కుమారుడు తిట్టారని, అందువల్ల ఇకపై నటించబోనని బండ్ల గణేష్ స్పష్టం చేశారు.