ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డివి
Last Modified: శుక్రవారం, 27 నవంబరు 2020 (19:26 IST)

సినిమాగా గాడ్సే 'మరణ వాంగ్మూలం'

భారతదేశ చరిత్రలో ఎవ్వరూ ఎన్నడూ భారీరంగంగా మాట్లాడుకోవడానికి ఇష్టపడని పేరు గాడ్సే. మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ హాంతకుడుగా గాడ్సే అందరికి తెలుసు. స్వాతంత్ర్యనంతరం భారతదేశ చరిత్రలో గాంధీ హత్యకు చాలా ప్రాధాన్యత ఉంది. చాలా సందర్భాల్లో ఒక వ్యక్తి మీద ఉన్న గౌరవం, ఆరాధన భావం ఇంకేవిషయాలను పట్టించుకొనివ్వదు. అలాగే గాడ్సే చరిత్ర కూడా బలవంతంగా విస్మరించడం జరిగింది. చరిత్ర ఎప్పుడు విజేతలు విజయ గాధగానే సాగుతుంది. అందుకే గాడ్సే అనగానే మన కళ్ళముందు ఒక హంతకుడు ప్రత్యక్షం అయ్యేలా మైండ్ సెట్ అయిపోయింది.
 
ఏ హత్య కేవలం ఆ మనిషిని భౌతికంగా నిర్మూలించడం ఒక్కటే లక్ష్యంగా జరగదు, దాని వెనుక అనేక అంశాలు ఉంటాయి. గాంధీజీ హత్య క్షిణికావేశంతో చేసినది కాదు. దానికి గా సే పశ్చాత్తాప పడనులేదు. గాంధీజీ హత్య అనంతరం ఆయన కుమారుడు అప్పట్లో హిందూస్తాన్ టైమ్స్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్న దేవదాస్ గాంధీ తిన్నగా పోలీస్ స్టేషన్లో ఉన్న గాడ్సే దగ్గరకు వెళ్లారు. హత్య వ్యక్తిగతమా అని అడిగారు, కాదని స్థిరంగా సమాధానం చెప్పారు గాడ్సే.
 
మరి గాంధీజీని బహిరంగంగా ప్రజల సమక్షంలో హత్య చేయడం వెనక ఉన్న బలమైన తాత్విక చింతన ఏమిటి? ఇదే మమ్మల్ని ఈ చిత్రం తియ్యడానికి ప్రేరేపించిన అంశం. గాడ్సే గురించిన వివరాలు తవ్వుకుంటూ వెళ్లే కొద్ది అనేక ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. గాడ్సే జస్ట్ ఒక క్రిమినల్ కాదు. గాడ్సే ఒక పత్రికా సంపాదకుడు. అగ్రణి, హిందు రాష్ట్ర అనే పత్రికలకు సంపాదకుడిగా వ్యవహరించిన వ్యక్తి. చిన్నప్పటి నుండి స్థిరమైన అభిప్రాయాలు కలిగిన వ్యక్తి.
 
గాడ్సే ను సమగ్రంగా అర్థం చేసుకోకపోతే భారతదేశ చరిత అర్థం కాదు. గాడ్సేను అధ్యయనం చేయడం ప్రారంభించిన తరువాత మాకు అనిపించినదే కాదు ఇది మా కచ్చితమైన అభిప్రాయం. గాంధీజీ హత్య నేపథ్యంలో భారతదేశంలో ఒక నవలగానీ సినిమా గానీ రాకపోవడం దారుణం. ఈ తప్పుని సరి చేయాలనే లక్ష్యంతో మరణవాంగ్మూలం సినిమా తెలుగు, హిందీ భాషల్లో రూపొందించాలనుకున్నాము. ఇది ఒక యజ్ఞంగా ఈ దేశ ప్రజల ముందు వాస్తవాలను ఆవిష్కరించడం మాత్రమే కాదు గాడ్సే విస్మరించాల్సిన అధ్యాయం కాదు అని చెప్పాలనే లక్ష్యంతో తీస్తున్న సినిమా. డిసెంబర్ నెలలో సెట్స్ మీదకు వెళ్లే ఈ సినిమా నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.
 
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు భరద్వాజ్ మాట్లాడుతూ, గాడ్సే వెనకాల ఉన్న భావాజాలాన్ని తెలియజేస్తున్నాము. దేశంలో మాత సామరస్యం ఉండాలి. ఓపెన్‌గా గాడ్సే గురించి చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నాము. అంతా కొత్తవారితో ఈ సినిమా చెయ్యబోతున్నాను. దాదాపు రెండేళ్లు ఈ సినిమాపై రీసెర్చ్ చేశాను. మీదట ఈ సబ్జెక్ట్ మీద నవల రాద్దాం అనుకున్నాను. కానీ గాడ్సే భావాజాలాన్ని చెప్పడానికి సినిమా తీస్తే బాగుంటుందని అనిపించింది.
 
ఈ సినిమా ఇప్పుడు తియ్యడం కరెక్టని భావించి తీస్తున్నాను. గోపాల్ గాడ్సే 19 సంవత్సరాలు జైలు జీవితం అనుభభవించాడు, 2005లో అతను మరణించాడు. అతను గాంధీజీ హత్యలో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు వంటి అంశాలు ఈ సినిమాలో చూపించడం జరిగిందని తెలిపారు.
 
నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ... గాడ్సే రాసిన పుస్తకం అందరిని ఆలోచింపజేస్తుంది. గాడ్సే కోర్టులో తన వాగ్మూలం ఇచ్చారు. దాన్ని పరిశీలిస్తే ఆయన ఎందుకు ఆ పని చేశారో అర్థం అవుతుంది. అసలు గాడ్సే ఎలా విలన్ అయ్యాడు వంటి విషయాలు భరద్వాజ్ గారు ఈ మరణ వాంగ్మూలంలో చెప్పబోతున్నాడు. ఆసక్తికరమైన కథ కథనాలతో సాగబోతున్న ఈ సినిమా గురించి నేను ఎదురుచూస్తున్నానని తెలిపారు.
 
దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ... నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న భరద్వాజ్ గారు చేస్తున్న మరణ వాంగ్మూలం ఒక సంఘటనను ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఒక ఆసక్తికరమైన అంశంగా ఉంటుందని తెలిపారు. నిర్మాత సూరజ్ మాట్లాడుతూ... డైరెక్టర్ భరద్వాజ్ గారు గాడ్సే మీద సినిమా గురుంచి ఐడియా చెప్పగానే ఆసక్తికరంగా అనిపించింది. మరణ వాంగ్మూలం పేరుతో తెరకెక్కబోతున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభించి వచ్చే ఏడాది వేసవిలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తాం. త్వరలో ఈ మూవీలో నటించబోయే ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్ వివరాలు తెలుపుతాము. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న అందరికి ధన్యవాదాలు తెలిపారు.