శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 29 అక్టోబరు 2018 (16:51 IST)

పరువు కోసం కుమార్తె గొంతు నులిమి చంపేసి.. చితిపేర్చి కాల్చేశారు...

తెలుగు రాష్ట్రాల్లో పరువు హత్యల పరంపర కొనసాగుతోంది. మొన్నటికి మొన్న నల్గొండ జిల్లాలో ఓ యువకుడుని అమ్మాయి తండ్రి కిరాయి మనుషులతో చంపించాడు. ఆ తర్వాత కర్నూలు జిల్లాలో మరో పరువు హత్య జరిగింది. ఇపుడు ఒంగోలు జిల్లాలో జరిగింది. 
 
ఓ యువతిని కుటుంబ సభ్యులే హతమార్చారు. దళిత యువకుడిని ప్రేమించిందనే కారణంతో కన్న కుమార్తెను గొంతు నులిమి చంపేశారు. ఆ తర్వాత చితి పేర్చి కాల్చేశారు. జిల్లా కోమరోలు మండలం నాగిరెడ్డి పల్లిలో సోమవారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నాగిరెడ్డి పల్లికి చెందిన ఆవులయ్య కుమార్తె ఇంద్రజ (20) అనే యువతి గిద్దలూరులోని ఓ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన చైతన్య గిద్దలూరులోనే డిగ్రీ చదువుతున్నాడు. రోజూ కాలేజీకి వెళ్లివచ్చే సమయంలో వారిద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే అబ్బాయి దళితుడు కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు వారి ప్రేమకు అడ్డు చెప్పారు. పైగా, అబ్బాయిని మందలించారు కూడా. పోలీసులతో వార్నింగ్ కూడా ఇప్పించారు. 
 
ఈ విషయం తెలిసిన ఇంద్రజ తల్లిదండ్రులపై అలిగి.. ఇంట్లో అన్నం తినడం మానేసింది. దీంతో తల్లిదండ్రులు ఆమెను హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి పంపించారు. అక్కడ కూడా ఆమె అన్న తినకుండా అలాగే ఉండటంతో మళ్లీ సొంతూరికి తీసుకొచ్చారు. ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు రాత్రికి రాత్రే ఉరేసి చంపేశారు. 
 
ఎవరికీ అనుమానంరాకుండా ఆమె మృతదేహాన్ని ఊరి బయటకు తీసుకెళ్లి తగులబెట్టారు. తెల్లవారుజామున మంటలు వస్తుండటంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.