1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 31 జులై 2021 (09:48 IST)

పరువుకు భంగం కలిగించేలా మీడియా కథనాలు లేవు : కోర్టు

అడల్ట్ కంటెంట్ చిత్రీకరణ కేసులో భర్త రాజ్‌ కుంద్రా అరెస్టు తర్వాత తన పరువుకు నష్టం కలిగించేలా, ద్వేషపూరితంగా కథనాలు ప్రచారమయ్యాయని, ఈ విషయంలో మీడియాను నియంత్రించాలంటూ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
 
మీడియా కథనాల ద్వారా తన ప్రతిష్టకు తీవ్ర భంగం వాటిల్లిందని, కాబట్టి రూ.25 కోట్ల పరిహారాన్ని ఇప్పించాలని, తన పరువుకు భంగం కలిగేలా యూట్యూబ్, ఫేస్‌బుక్, గూగుల్‌లో వచ్చిన కథనాలను తొలగించేలా ఆదేశించాలంటూ వేసిన శిల్ప పిటిషన్‌ను కోర్టు శుక్రవారం విచారించింది.
 
ఈ సందర్భంగా జస్టిస్ గౌతమ్ పటేల్ మాట్లాడుతూ, జర్నలిజంలో మంచి, చెడు నిర్ణయించడంలో న్యాయస్థానాలది పరిమిత పాత్ర అని వ్యాఖ్యానించారు. శిల్పాశెట్టికి వ్యతిరేకంగా ప్రసారమైన మీడియా కథనాలలో ఆమె పరువుకు భంగం కలిగించే అంశాలేవీ లేవని పేర్కొన్నారు. 
 
అవన్నీ పోలీసుల కథనాల ఆధారంగానే ఉన్నాయని స్పష్టం చేశారు. శిల్పాశెట్టి ఏడ్చిందని, భర్తతో గొడవపడిందని మాత్రమే వాటిలో ఉందన్నారు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు నాలుగు గోడల మధ్య ఈ ఘటన జరిగితే అది వేరే విషయం కానీ, బయటి వ్యక్తుల మధ్య జరిగిన విషయాలనే ఆ కథనాల్లో ప్రస్తావించారని, ఇదెలా పరువునష్టం అవుతుందని జస్టిస్ గౌతమ్ పటేల్ ప్రశ్నించారు.
 
ఇంకా చెప్పాలంటే శిల్పపై కథనాలు మానవీయ కోణంలోనే ఉన్నాయని, ఈ కథనాల్లో ఎలాంటి తప్పు కనిపించడం లేదన్నారు. ప్రజా దృష్టిలో ఉండే జీవితాన్ని ఎంచుకున్నప్పుడు ఇలాంటివి అందులో భాగం అవుతాయని, మీ జీవితం మైక్రోస్కోప్ కిందే ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని జస్టిస్ పటేల్ సూచించారు. 
 
అంతేకాదు, సామాజిక మాధ్యమాల్లో వచ్చే కంటెంట్‌ను కూడా నియంత్రించాలని కోరడం ప్రమాదకరమని పేర్కొంది. ‘పీపింగ్ మూన్’ అనే వెబ్‌సైట్‌లో శిల్పాశెట్టిపై వచ్చిన కథనాలపై ఆమె న్యాయవాది బీరేంద్ర సరాఫ్ కోర్టు దృష్టికి తీసుకురాగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే, నిజానిజాలను నిర్ధారించుకోకుండా ద్వేషపూరిత కంటెంట్‌తో అప్‌లోడ్ చేసిన వీడియోలను తొలగించాలంటూ మూడు యూట్యూబ్ చానళ్లను కోర్టు ఆదేశించింది.