గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 మే 2020 (13:52 IST)

సినీ కళాకారుల భవిష్యత్‌ను చూడండి... సీఎం కేసీఆర్‌కు చిరంజీవి విజ్ఞప్తి

కరోనా సంక్షోభం, లాక్డౌన్ కారణంగా తెలుగు చిత్రపరిశ్రమ స్తంభించిపోయింది. అనేక పాత, కొత్త ప్రాజెక్టులన్నీ ఆగిపోయాయి. ఫలితంగా 24 కళలకు చెందిన సుమారు 14 వేల మంది సినీ కార్మికులు తమతమ ఇళ్ళకే పరిమితమైవున్నారు. వీరి భవిష్యత్ ఇపుడు ప్రశ్నార్థకంగా మారింది. 
 
ఈ నేపథ్యంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో తెలుగు సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. ఈ సమావేశం చిరంజీవి నివాసంలో జరిగింది. ఈ సమావేశంలో చిరంజీవి మాట్లాడుతూ, షూటింగులు ఎప్పటి నుంచి ప్రారంభం కావాలనే విషయంపై ప్రభుత్వం నుంచి ఏదో ఒక సమాధానం రావాలి అనే దానిపై సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు.
 
లాక్డౌన్ ఆంక్షలను దశల వారీగా సడలిస్తున్నారనీ, అలాగే, సినీ ఇండస్ట్రీకి కూడా ఈ ఆంక్షల సడలింపును వర్తింపజేయాలని కోరారు. లేనిపక్షంలో సినీ రంగం భవిష్యత్తు ఏమిటనే సందేహం ప్రతి ఒక్కరికీ కలుగుతుందన్నారు. 
 
నిజానికి సినిమా షూటింగులు జరుపుకునేందుకు ఏ ఒక్కరి అనుమతి అవసరంలేదని చిరంజీవి గుర్తుచేశారు. కానీ, కరోనా వ్యాప్తికి తాము కారణంకారాదని భావించి, ప్రభుత్వ సహకారంతో షూటింగులు చేసుకోవాలనేది తమ అభిమతమన్నారు.  
 
ఇది కేవలం విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల కోసమో, లేదా షూటింగ్ మధ్యలో ఉన్న సినిమాల కోసమో చేస్తున్న తాము చేస్తున్న విన్నపం కాదని... షూటింగులు జరిగితే కానీ బతుకులు ముందుకు సాగని 14 వేల మంది పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని చేస్తున్న విన్నపమన్నారు. 14 వేల మందిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కోరుతున్నామని అన్నారు. ఇతర రంగాలకు లాక్డౌన్ ఆంక్షలు సడలించినట్టుగానే తమకు కూడా ఆంక్షలు సడలించి, షూటింగ్‌లు జరుపుకునేలా చర్యలు తీసుకోవాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు. 
 
కాగా, ఈ సమావేశానికి హీరోలు అక్కినేని నాగార్జున, నాని, నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, సి. కళ్యాణ్, సినీ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, రాజమౌళి తదితరులు హాజరయ్యారు.