1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 1 నవంబరు 2018 (10:34 IST)

తెలుగువారిపైనే కాదు.. తెలుగు భాషపై కూడా ఇంత వివక్షా? : చంద్రబాబు ప్రశ్న

ప్రధాని నరేంద్ర మోడీ నర్మదా నదీ తీరంలో ఆవిష్కరించిన సర్దార్ వల్లాభాయ్ పటేల్ విగ్రహం (స్టాట్యూ ఆఫ్ యూనిటీ) వద్ద తెలుగు భాషకు గుర్తింపు లేకపోవడంపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఇదే అంశంపై ఆయన గురువారం తన ట్విట్టర్ ఖాతాలో కొన్ని పోస్టులు చేశారు. 
 
"భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడే మూడవ అతి పెద్దదైన తెలుగు భాషకు #StatueOfUnity వద్ద గుర్తింపు లభించక పోవటంతో తెలుగు తల్లి బిడ్డగా నా మనసు క్షోభిస్తోంది. పైసా ఖర్చు లేని ఇటువంటి విషయాలలో కూడా తెలుగు వారంటే ఇంత వివక్షా? ప్రతి తెలుగు వారూ అలోచించి, తమ ఆవేదనను వ్యక్తం చేయవలసిన తరుణమిది" అంటూ పేర్కొన్నారు. 
 
అలాగే, మరో ట్వీట్‌లో 'పార్లమెంట్లో ఆంధ్ర ప్రదేశ్‌కు ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చకపోయినా నవ్యాంధ్ర ప్రదేశ్ నిర్మాణానికి శ్రమిస్తున్నాం. బీజేపీ మేనిఫెస్టోతో పాటు ఎన్నికల సభలలో నరేంద్ర మోడీగారు ఇస్తామన్న ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎదురు దాడి చేస్తుంటే భరిస్తున్నాం, సహిస్తున్నాం. లక్ష్యం కోసం పోరాడుతున్నాం' అని వ్యాఖ్యానించారు.