శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 17 నవంబరు 2017 (11:21 IST)

నంది అవార్డులు కాదు.. పచ్చ అవార్డులు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నంది అవార్డులపై సినీ పరిశ్రమకు చెందిన అనేక మంది పెద్దలు మండిపడుతున్నారు. ఇవి నంది అవార్డులు కాదనీ, పచ్చ అవార్డులంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా, ఆ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నంది అవార్డులపై సినీ పరిశ్రమకు చెందిన అనేక మంది పెద్దలు మండిపడుతున్నారు. ఇవి నంది అవార్డులు కాదనీ, పచ్చ అవార్డులంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా, ఆ సామాజికవర్గానికి చెందిన వారికే అవార్డులు ఇచ్చుకున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
2014, 15, 16 సంవత్సరాలకు గాను నంది అవార్డులను ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ అవార్డుల్లో భాగంగా, 'రుద్రమదేవి' సినిమాలో అల్లు అర్జున్ పాత్రకి బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డ్ ఇవ్వటంపై చిచ్చు మొదలైంది. ఈ చిచ్చు మంటలు రేపుతోంది. గీతా ఆర్ట్స్ నిర్మాత బన్నీ వాసు పేరుతో వచ్చిన మొదటి కామెంట్.. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ వర్సస్ సినీ ఇండస్ట్రీగా మారాయి. 
 
బాలయ్య నటించిన 'లెజెండ్' మూవీకి అవార్డ్స్ పంట పండితే.. 'మనం', 'ఊపిరి' వంటి బ్లాక్‌బస్టర్ మూవీకి కనీసం అవార్డ్స్ రాకపోవటం విచిత్రం అని సినీ ఇండస్ట్రీలోని కొందరు గళం విప్పుతున్నారు. 'రుద్రమదేవి' సినిమాకి ఏపీ ప్రభుత్వం మరోసారి అన్యాయం చేసిందని ఆ చిత్ర దర్శక నిర్మాత గుణశేఖర్ బాహాటంగానే విమర్శిస్తున్నారు. ప్రశ్నించడం తప్పా అంటూ ఓ లేఖ విడుదల చేశాడు. 
 
వినోదపు పన్ను మినహాయింపు ఎందుకివ్వలేదని ప్రశ్నించినందుకే.. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో అన్యాయం జరిగిందని నిలదీశాడు. అవార్డు విషయంలో ప్రశ్నిస్తే.. మూడేళ్లపాటు అనర్హులుగా ప్రకటిస్తామని చెప్పటం అంటే మనం ఏ దేశంలో ఉన్నాం.. స్వతంత్ర భారతంలోనేనా ఉన్నామా అంటూ గుణశేఖర్ నిలదీశారు. 
 
ఇక రేసుగుర్రం చిత్ర నిర్మాత నల్లమలుపు బుజ్జి అయితే, ఏకంగా ఆ సామాజికవర్గాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. మొత్తం కమ్మ కులం వాళ్లకే ఇచ్చారని.. అవి దొంగ అవార్డ్స్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. 2014లో 'రేసుగుర్రం' హిట్ సినిమా.. కానీ ఏవేవో సినిమాలకు నంది అవార్డ్ ఇచ్చారు మాకు ఇవ్వలేదన్నారు. కనీసం మా హీరోకి కూడా ఎందుకు అవార్డ్ ఇవ్వలేదంటూ జ్యూరీ వైఖరిని తప్పుబట్టారు. అవార్డుల గురించి మాట్లాడొద్దు అంటూ నిర్మాత సి. కళ్యాణ్ అంటున్నారు.. మరి ఒక హిట్ చిత్రం నిర్మించి చూపించినోడికి ఆ నొప్పి ఏంటో తెలుస్తుందన్నారు. దమ్ముంటే సి కళ్యాణ్ ఓ హిట్ చిత్రాన్ని నిర్మించాలంటూ సవాల్ విసిరారు. 
 
అలాగే, మెగా ఫ్యాన్స్ అయితే, మరింతగా రెచ్చిపోతున్నారు. అవార్డుల ఎంపికలో మెగా నటులకు అన్యాయం జరిగిందని మెగా అభిమానులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి ఈ మూడు సంవత్సరాల్లో ఒక్క ఉత్తమ చిత్రం కూడా రాలేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. 'కంచె' లాంటి ఉత్తమ సినిమాను ఎందుకు సైతం పరిగణనలోకి తీసుకోలేదని దుమ్మెత్తిపోస్తున్నారు. బన్నీ వాసు పెట్టిన చిచ్చు.. ఇప్పుడు అగ్ని పర్వతంగా పేలింది. దీనిపై అవార్డుల ఎంపిక జ్యూలీ ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.