శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By

నవంబరులో నయన్ - విఘ్నేష్ నిశ్చితార్థం

కోలీవుడ్ ప్రేమజంట నయనతార - విఘ్నేష్‌లు ఎట్టకేలకు ఓ ఇంటివారు కాబోతున్నారు. వీరిద్దరూ గత కొన్ని నెలలుగా ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. వీరిద్దరూ వచ్చే నవంబరు నెలలో నిశ్చితార్థం చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 
 
ఇప్పటికే నయన, విఘ్నేశ్‌లు రహస్యంగా ఉంగరాలు మార్చుకున్నారనే ప్రచారం తమిళ సినీ ఇండస్ట్రీలో ఉంది. ఇప్పడు ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో వీరు నిశ్చితార్థం చేసుకోనున్నారట. 2015లో 'నానుమ్‌ రౌడీదాన్' అనే సినిమా ద్వారా నయన్‌, విఘ్నేశ్‌కు మధ్య పరిచయం జరిగింది. ఈ సినిమాకు విఘ్నేశ్‌ దర్శకత్వం వహించగా, హీరోయిన్‌గా నయనతార నటించింది.
 
అపుడే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి గాఢ ప్రేమికులుగా మారిపోయారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి విహారయాత్రలకు, ఫంక్షన్లకు వెళుతూ కెమెరాల కంటికి చిక్కుతున్నారు. పలు విహార యాత్రలకు సంబంధించిన ఫొటోలను వీరు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. ఈ క్రమంలో వీరిద్దరూ నవంబరు నెలలో నిశ్చితార్థం చేసుకుని ఆ తర్వాత ఓ ఇంటివారు కావాలని నిర్ణయించుకున్నారు. 
 
ఇకపోతే, అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ నయనతార బిజీగా ఉన్న విషయం తెల్సిందే. తమిళంలో శివకార్తికేయన్ నటించిన 'మిస్టర్ లోకల్' చిత్రంలో నయనతార నటించగా ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అలాగే, తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'సైరా నరసింహా రెడ్డి' చిత్రంతో పాటు.. రజినీకాంత్ 'దర్బార్' చిత్రంలోనూ నటించనున్నారు.