కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో నాకు తెలుసు: రాజ్యవర్ధన్ రాథోర్
కట్టప్ప.. బాహుబలిని ఎందుకు చంపాల్సి వచ్చిందో నాకు తెలుసు అంటున్నారు కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ రాథోర్.
బాహుబలి బిగినింగ్ చివర్లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడోనని ట్విస్ట్ పెట్టి ముగించాడు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? యావత్ దేశమంతా ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎంతో ఉత్కంఠగా బాహుబలి2 కోసం ఎదురుచూస్తోంది.
ఈ ప్రశ్నకు సమాధానం ఆ సినిమా దర్శకుడు రాజమౌళి, నటీనటులకు తప్ప మరెవరికీ తెలీదు. అయితే కట్టప్ప.. బాహుబలిని ఎందుకు చంపాల్సి వచ్చిందో నాకు తెలుసు అంటున్నారు కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ రాథోర్. గోవాలో జరిగిన 47వ ఇంటర్నేషన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమం సోమవారంతో ముగిసింది. ఆఖరి రోజున రాజ్యవర్ధన్ని అతిథిగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా రాథోర్ మాట్లాడుతూ.. 'బాహుబలి లాంటి సినిమాను తెరకెక్కించినందుకు, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో నాకు చెప్పినందుకు రాజమౌళికి ధన్యవాదాలు.. అని చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వానికి అన్నీ తెలియాలని.. కానీ ఇలాంటి విషయాలను ప్రభుత్వం సీక్రెట్గా ఉంచుతుందని రాజమౌళికి తెలుసునని రాథోర్ తెలిపారు. కాబట్టి తనకు తెలిసినా ఏం ఫర్వాలేదని తెలిపారు. ఆఖరికి ఆయన కూడా ఈ రహస్యాన్ని చెప్పకుండా దాటవేశారు.