శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 30 జనవరి 2019 (11:28 IST)

శ్రీదేవికిచ్చిన మాటను నిలబెట్టుకున్న తమిళ హీరో

అతిలోక సుందరి దివంగత శ్రీదేవికి ఇచ్చిన మాటను ఓ తమిళ హీరో నిలబెట్టుకున్నాడు. గతంలో ఆమెకు ఇచ్చిన మాట ప్రకారం.. శ్రీదేవి భర్త నిర్మించే చిత్రంలో హీరోగా నటించేందుకు సమ్మతించారు. ఆ హీరో ఎవరు కాదు.. అజిత్. కోట్లాది మంది అభిమానులను కలిగిన అజిత్.. తాజా చిత్రం 'విశ్వాసం'. ఈ చిత్రం సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'పేట' చిత్రంతో పోటీపడి సంక్రాంతికే విడుదలై ప్రేక్షకుల మన్నలు పొందింది. 
 
తాజాగా శ్రీదేవి భర్త, బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. హిందీలో వచ్చిన 'పింక్' చిత్రాన్ని తమిళంలోకి అనువందించనున్నారు. ఈ చిత్రంలో విద్యాబాలన్, శ్రద్ధా శ్రీనాథ్‌లు కీలక పాత్రలను పోషించనున్నారు. ఈ చిత్రంలో హీరోగా నటించేందుకు అజిత్ అంగీకరించారు. ఈ విషయాన్ని బోనీ కపూర్  స్వయంగా వెల్లడించారు. 
 
అదే అంశంపై బోనీకపూర్ మాట్లాడుతూ, 'హిందీలో వచ్చిన 'పింక్' సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్నాను. విద్యాబాలన్ .. శ్రద్ధా శ్రీనాథ్‌లు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. తన మాతృభాష తమిళంలో అజిత్ హీరోగా ఒక సినిమాను నిర్మించాలనేది శ్రీదేవి కల. తరచూ ఆమె నాతో ఈ మాట అంటూ ఉండేది. "ఇంగ్లీష్ వింగ్లీష్" షూటింగ్ సమయంలో ఇదేమాట అజిత్‌తో ఆమె అంటే, తప్పకుండా చేస్తానని ఆయన మాట ఇచ్చాడు. ఇప్పుడు ఈ సినిమాకి ఆయన పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. అలా శ్రీదేవికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు.. ఆమె కలను నిజం చేస్తున్నాడు" అని బోనీకపూర్ చెప్పారు. కాగా, శ్రీదేవి నటించిన ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంలో కూడా అడగ్గానే హీరో అజిత్ నటించిన విషయం తెల్సిందే.