ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 17 సెప్టెంబరు 2018 (11:44 IST)

కులం పిచ్చి వద్దు.. సోషల్ మీడియాకు దూరంగా వుండండి.. చిన్మయి

కులం పేరుతో దేశంలో చాలా దారుణాలు జరుగుతున్నాయని, నీళ్లకు, మట్టికి కులం సర్టిఫికెట్ ఇవ్వడంలో భారతీయులు విజయవంతమయ్యారని ఆవేదన వ్యక్తం చేసింది. కుల జాడ్యం పోవాలంటే తొలుత పేరు చివరన ఉండే తోకలను కత్తిరించా

కులం పేరుతో దేశంలో చాలా దారుణాలు జరుగుతున్నాయని, నీళ్లకు, మట్టికి కులం సర్టిఫికెట్ ఇవ్వడంలో భారతీయులు విజయవంతమయ్యారని ఆవేదన వ్యక్తం చేసింది. కుల జాడ్యం పోవాలంటే తొలుత పేరు చివరన ఉండే తోకలను కత్తిరించాల్సి ఉంటుందని చిన్మయి పేర్కొంది. అయితే, అది మాత్రమే సరిపోదని, అది మనసు పొరల్లోంచి రావాలంది.
 
కులం జాడ్యం నుంచి బయటపడేందుకు గాయని చిన్మయి కొన్ని సూచనలు చేసింది. ఎవరైనా కుల ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు దానిని సున్నితంగా తోసిపుచ్చాలని చెప్పింది. కులం గురించి అడిగితే తెలియదని చెప్పాలంది. అంతేగాకుండా విరివిగా పుస్తకాలు చదవడంతోపాటు సోషల్ మీడియాకు వీలైనంత దూరంగా ఉండాలని చిన్మయి సూచించింది. ప్రతిసారీ విద్యావ్యవస్థను నిందించడం మాని పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించాలని చిన్మయి సూచించింది. 
 
పరువు పోరులో ప్రాణం కోల్పోయిన ప్రణయ్ హత్యోదంతంపై చిన్మయి శ్రీపాద స్పందించింది. తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ లేఖను పోస్టు చేసింది. తమిళనాడులోని కౌసల్య-శంకర్‌ల హత్యతో ప్రణయ్ హత్యను పోల్చింది. దేశంలో కులం ఓ జాడ్యంలా విస్తరించిందని, కులం పేరు చెప్పుకోకుండా ఎవరైనా బతకలేకపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. కులం పేరుతో పెద్ద పెద్ద కేసుల నుంచి కూడా నిందితులు ఇట్టే బయటపడుతున్నారని ఆరోపించింది.
 
కులం ఒకటే అయినప్పటికీ చాలామందికి ఆర్థిక స్థితిగతులు, అమెరికా వీసా లాంటివి పెళ్లి సంబంధాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని చిన్మయి వివరించింది. పెళ్లి ఖర్చుల్లో అమ్మాయి-అబ్బాయిలది చెరో సగం అనే వాళ్లు ఎంతమంది ఉన్నారని ప్రశ్నించింది. కుల పిచ్చి అన్ని మతాల్లోనూ ఉందన్న చిన్మయి దానిని అంత త్వరగా నిర్మూలించడం సాధ్యం కాదని చిన్మయి తేల్చి చెప్పింది.