శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : సోమవారం, 2 ఏప్రియల్ 2018 (18:01 IST)

'ఆరెంజ్'కు 'రంగస్థలం'కు లింకేంటి... మహేష్ 'వన్' నుంచి నేర్చుకున్నా: సుకుమార్(Video)

రంగస్థలం చిత్రం రెండంటే రెండు రోజుల్లో రూ. 100 కోట్లను వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇంకా ఈ చిత్రం మరిన్ని రికార్డులను సృష్టించేందుకు పరుగులు తీస్తోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్ ఏర్

రంగస్థలం చిత్రం రెండంటే రెండు రోజుల్లో రూ. 100 కోట్లను వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇంకా ఈ చిత్రం మరిన్ని రికార్డులను సృష్టించేందుకు పరుగులు తీస్తోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ సమాధానమిచ్చారు.
 
రంగస్థలం చిత్రం అనేది పూర్తిగా గ్రామీణ నేపధ్యం... ఈ చిత్రాన్ని చెర్రీతో తీయాలంటే సవాల్ కదా... మరి ఎలా ఒప్పించారంటూ సుకుమార్‌ను అడిగితే... రామ్ చరణ్ ఇప్పటివరకూ క్యారెక్టర్ తీసుకుని చేసినవి లేవు. ఆరెంజ్ చిత్రం అలాంటిదే అయినప్పటికీ నేను చరణ్ వద్దకు ఓ క్యారెక్టర్‌తో వెళ్లాను. ఆయన దానికి ఓకే చెప్పడంతో సినిమా స్టార్ట్ అయ్యింది. 
 
మరి మహేష్ బాబుతో తీసిన వన్ చిత్రం విషయంలో ప్రేక్షకులు మారాలంటూ అన్నారు కదా అని అడిగితే... బహుశా అప్పుడు నాకు అంత మెచ్యూరిటీ లేదని అనుకుంటున్నాను. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే కథను తీస్తే రంగస్థలం చిత్రంలా హిట్ అవుతుందని ఇప్పుడు అర్థం చేసుకున్నాను. వన్ చిత్రం నుంచి ఇప్పటివరకూ చూస్తే నేను చాలా నేర్చుకున్నాను అంటూ చెప్పారు.
 
ఇక రాంచరణ్ రంగస్థలం చిత్రంలో నటనకు మీ తండ్రి చిరంజీవి, అమ్మ, భార్య ఎవరి కాంప్లిమెంట్స్ బెస్ట్ అని చెప్తారు అనడిగితే... మా నాన్నగారే. ఐయామ్ ప్రౌడ్ అంటూనే జీలస్ అని కూడా అన్నారనీ, అంతకు మించిన కాంప్లిమెంట్ అంత పెద్ద నటుడి నుంచి ఇంకేముంటుందని అన్నారు. తనకు ఈ చిత్రంలో నటించినందుకు అవార్డుకు మించిన ఆనందం కలుగుతుందని చెప్పుకొచ్చారు.
 
ఇదిలావుండగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా కనకవర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా, ఓవర్సీస్‌లో రికార్డు స్థాయి వసూళ్లను సాధించిన తెలుగు చిత్రాల జాబితాలో ఈ చిత్రం చేరిపోయింది. తొలిరోజునే 1.2 మిలియన్ డాలర్ల గ్రాస్‌ను సాధించిన ఈ సినిమా, ఆదివారానికి 2.32 మిలియన్ డాలర్లను రాబట్టింది. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా 3 మిలియన్ డాలర్లను రాబట్టడం ఖాయమని అంటున్నారు. 
 
ఓవర్సీస్‌లో 'బాహుబాలి 2', 'బాహుబలి' తర్వాత ఫుల్‌రన్‌లో 'శ్రీమంతుడు' 2.87 మిలియన్ డాలర్లను సాధించి 3వ స్థానంలో నిలిచింది. మరికొన్ని రోజుల్లో ఈ స్థానాన్ని 'రంగస్థలం' కైవసం చేసుకోనుందని చెబుతున్నారు. మున్ముందు ఈ సినిమా ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి. ఇక తెలుగు రాష్ట్రాల్లో చిట్టిబాబు బాహుబలి మినహా ఇతర చిత్రాల రికార్డులను తిరగరాసేలా దూకుడు ప్రదర్శిస్తున్నాడు.